విధులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
ABN , First Publish Date - 2022-07-02T05:22:53+05:30 IST
ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది విధులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ నిశాంత్కుమార్ హెచ్చరించారు. శుక్రవారం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు.
కలెక్టర్ నిశాంత్కుమార్
గరుగుబిల్లి, జూలై 1 : ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది విధులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ నిశాంత్కుమార్ హెచ్చరించారు. శుక్రవారం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. తొలుత గురుగుబిల్లి తహసీల్దార్ కార్యాలయంలో మ్యూటేషన్ల నిర్వహణతో పాటు రెవెన్యూ సమస్యలపై తహసీల్దార్ అజూ రఫీజాన్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రావుపల్లి సచివాల యంలో సిబ్బంది హాజరు , రికార్డులను పరిశీలించారు. సచివాలయ సిబ్బంది సకాలంలో విధులకు హాజరుకాకుంటే రెగ్యులైజేషన్లో ఇబ్బందులు తప్పవన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన అని, విధులకు డుమ్మా కొడితే సహించేది లేదన్నారు. మండలంలో ఆరు గ్రామాల్లో చెరువులు ఆధునికీకరణకు నిధులు మంజూరైనట్లు ఆయన తెలిపారు. సచివాలయం పరిదిలో అర్ధాంతరంగా నిలిచిన భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గరుగుబిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మందుల నిల్వలతో పాటు పది రకాల వ్యాధి నిరోధక టీకాలను పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని ఆదేశించారు. మలేరియా, డెంగ్యూ, అతిసార వ్యాధి కేసులు నమోదు కాకుండా ముందస్తుగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సచివాలయాల పరిధిలో ఇంటింటి ఫీవర్ సర్వేలు నిర్వహించాలని వైద్యులు పీఏ ప్రియాంక, కేకే సాగర్ను ఆదేశించారు. కరోనా బారిన పడకుండా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. నాడు-నేడు పథకం పనులపై ఆరా తీశారు. నిధుల కొరత కారణంగా నిలిచాయని వైద్యులు వివరించారు. ఈ పరిశీలనలో ఆర్డబ్ల్యూఎస్ జేఈ గౌరీశంకరరావు, ఎంపీడీవో ఎల్.గోపాలరావు, ఉపాధి ఏపీవో టి.రామకృష్ణంనాయుడు, ఈసీ వైఆర్డీ ప్రసాద్, సర్పంచ్ బి.మహేశ్వరరావు ఉన్నారు.