నాసిరకం నిర్మాణాలుంటే చర్యలు తప్పవు
ABN , First Publish Date - 2020-11-29T05:45:47+05:30 IST
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి) రైతువేదికలు, వైకుంఠధామాలు తదితర వాటి నిర్మాణాల్లో నాసిరకం ఉన్నట్లయితే చర్యలు తప్పవని కలెక్టర్ ఎం.హన్మంతరావు హెచ్చరించారు. అదనపు కలెక్టర్లు, ఇతర జిల్లాస్థాయి అధికారులు, వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో శనివారం ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
గడువులోగా రైతు వేదికలు పూర్తి చేయాలి
వైకుంఠధామాలకు రూ.5.71 కోట్లు చెల్లింపులు
టెలీ కాన్ఫరెన్స్లో కలెక్టర్ హన్మంతరావు
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి)
రైతువేదికలు, వైకుంఠధామాలు తదితర వాటి నిర్మాణాల్లో నాసిరకం ఉన్నట్లయితే చర్యలు తప్పవని కలెక్టర్ ఎం.హన్మంతరావు హెచ్చరించారు. అదనపు కలెక్టర్లు, ఇతర జిల్లాస్థాయి అధికారులు, వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో శనివారం ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతువేదికలు, కల్లాలు, నర్సరీలు, పల్లె ప్రకృతివనాలు, సెగ్రిగేషన్ షెడ్స్ వినియోగం, వర్మీ కంపోస్ట్ తయారీ తదితర అంశాలపై సమీక్షించిన ఆయన పనుల్లో పురోగతి ఆశించిన స్థాయిలో లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో చేపట్టిన రైతువేదికల నిర్మాణాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. రైతు వేదికల్లో మూడు వరుసల్లో మొక్కలు నాటాలని, విద్యుత్ నీటి కనెక్షన్లు తదితర పనులన్నింటినీ పూర్తి చేయాలన్నారు. వైకుంఠధామాల నిర్మాణాలకు సంబంధించి ఇప్పటివరకు రూ.5.71 కోట్లు చెల్లింపులు జరిపామన్నారు. పల్లె ప్రకృతివనాలు జిల్లాలో వందశాతం పూర్తి కావాలని ఆయన తహసీల్దార్లను ఆదేశించారు. నారాయణఖేడ్ డివిజన్లో పల్లె ప్రకృతివనాల కోసం అవసరమైన స్థలాలను కేటాయించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఆర్డీవోకు సూచించారు. రాయికోడ్ మండలంలో నిర్దేశించిన 34 పల్లె ప్రకృతివనాలు పూర్తయినందుకు తహసీల్దార్, ఎంపీడీవో, తదితర అధికారుల బృందాన్ని కలెక్టర్ అభినందించారు. వచ్చేనెల 3వ తేదిలోగా నర్సరీలన్నింటినీ పూర్తి చేయాలన్నారు. ఇదిలా ఉండగా, ఇంతటి ముఖ్యమైన టెలీ కాన్ఫరెన్స్కు హాజరుకాని అధికారులకు షోకాజ్ నోటీసులు పంపిస్తామని కలెక్టర్ తెలిపారు.