గుడ్డు ఇవ్వకపోతే చర్యలు తప్పవు : డీఈవో
ABN , First Publish Date - 2021-02-25T05:08:44+05:30 IST
విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజనంలో గుడ్డును ఇస్తోంది.
కడప(ఎడ్యుకేషన్), ఫిబ్రవరి 24: విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజనంలో గుడ్డును ఇస్తోంది. అయితే ఏ పాఠశాలలో అయినా పిల్లలకు గుడ్డు ఇవ్వలేదని తెలిస్తే చర్యలు తప్పవని డీఈఓ శైలజ హెచ్చరించారు. కడప నగరం గాంధీనగర్ మున్సిపల్ హైస్కూలులో బుధవారం మధ్యాహ్న భోజనాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మధ్యాహ్న భోజనంలో క్రమం తప్పకుండా పిల్లలకు గుడ్లు ఇవ్వాలని, జగనన్న గోరుముద్ద ప్రతి విద్యార్థికి మెనూ ప్రకారం అందించాలన్నారు. ఎంఈవో నారాయణ, ప్రధానోపాధ్యాయురాలు సత్యసుజాతమ్మ, నాగరాజమ్మ, సీఆర్పీలు పాల్గొన్నారు.
విద్యార్థుల ఆరోగ్యమే ‘ఆయుష్మాన్ భారత్’ ఉద్దేశ్యం
ప్రతి విద్యార్ధి ఆరోగ్యమే ఆయుష్మాన్భారత్ ముఖ్య ఉద్దేశ్యమని డీఈవో శైలజ అన్నారు. కడప గాంధీనగర్ ఉన్నత పాఠశాలలో బుధవారం ఆయుష్మాన్ భారత్ కోర్సు కోఆర్డినేటర్, ఎంఈవో నారాయణ ఆధ్వర్యంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం ఆన్లైన్ ద్వారా జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానవ వనరుల శాఖ ఆరోగ్యశాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మూడురోజుల శిక్షణ తరగతులను ఉపాధ్యాయులందరూ సద్వినియోగం చేసుకుని, పాఠశాలలో ప్రతి విద్యార్థి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం ఎస్ఆర్సీ శ్రీనివాసులరెడ్డి, మేరీ కార్యక్రమం ఆవశ్యకత వివరించారు. సీఆర్పీలు, హెచ్ఎంలు పాల్గొన్నారు.
విద్యార్థుల హాజరు ఆన్లైన్లో నమోదు చేయాలి
ప్రతి పాఠశాలల్లో ఖచ్చితంగా ప్రతిరోజూ విద్యార్థుల హజరును ఆన్లైన్లో నమోదు చేయాలని డీఈవో శైలజ తెలిపారు. అలా నమోదు చేయని పక్షంలో సంబంధిత ప్రధానోపాధ్యాయుల వేతనంలో కోత విధిస్తామని హెచ్చరించారు. విద్యార్థుల హాజరు నమోదు చేయని ప్రైవేటు యాజమాన్యానికి ఫైన్ విధించడం జరుగుతుందన్నారు. అలాగే రికగ్నైజేషన్ కూడా రద్దు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రతిరోజూ విద్యార్థుల హాజరు స్టూడెంట్ అటెండెన్స్ యాప్లో ఉదయం 11గంటల్లోపు నమోదు చేయాలని సూచించారు. అదే విధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ తప్పకుండా హాజరు వేయాలని తెలిపారు.