నకిలీ విత్తనాలు తయారుచేస్తే చర్యలు తప్పవు
ABN , First Publish Date - 2022-05-18T05:21:01+05:30 IST
నకిలీ విత్తనాలు తయారుచేసినా, విక్రయించినా చర్యలు తప్పవని విత్తన ధ్రువీకరణ అధికారి నగేష్ హెచ్చరించారు.
గజ్వేల్, మే 17: నకిలీ విత్తనాలు తయారుచేసినా, విక్రయించినా చర్యలు తప్పవని విత్తన ధ్రువీకరణ అధికారి నగేష్ హెచ్చరించారు. గజ్వేల్ మండల పరిధి కొడకండ్ల గ్రామ పరిధిలోని టియెర్రా కంపెనీతో పాటు గజ్వేల్ పట్టణంలోని శ్రీసాయి ట్రెడర్స్, అయ్యప్ప ట్రేడర్స్, సాగర్ ఫర్టిలైజర్స్లో గల పత్తి విత్తనాలను, రికార్డులను టాస్క్ఫోర్స్ బృందం సభ్యులైన వ్యవసాయశాఖ ఏడీ అనిల్, సీఐ రామకృష్ణతో కలిసి ఆయన తనిఖీ చేశారు. వారివెంట వ్యవసాయ శాఖ ఏడీ బాబూనాయక్, ఏవో నాగరాజు పాల్గొన్నారు.
మిరుదొడ్డి: ఫర్టిలైజర్ దుకాణాల్లో నకిలీ విత్తనాలను విక్రయించి, రైతులను మోసం చేస్తే లైసెన్స్ను రద్దు చేయడంతోపాటు పీడీయాక్ట్ను నమోదు చేస్తామని మిరుదొడ్డి మండల వ్యవసాయ అధికారి మల్లేశం హెచ్చరించారు. మంగళవారం మిరుదొడ్డిలో ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 65 శాతం సబ్సిడీపై జనుము, జీలుగ విత్తనాలు ఉంచిందని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఏఈవో సాయి, ఆగ్రోస్ సేవాకేంద్రం యాజమాని మహేందర్ ఉన్నారు.