అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2020-10-20T06:30:59+05:30 IST

గత జనవరి, ఫిబ్రవరి నెలల్లో కొడంగల్‌ డీసీఎంఎస్‌ కొనుగోలు కేంద్రంలో కందులు విక్రయించిన 123 మంది రైతులకు చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వకుండా రూ.73 లక్షల అవినీతికి పాల్పడిన డీసీఎంఎస్‌

అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి

వికారాబాద్‌, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): గత జనవరి, ఫిబ్రవరి నెలల్లో కొడంగల్‌ డీసీఎంఎస్‌ కొనుగోలు కేంద్రంలో కందులు విక్రయించిన 123 మంది రైతులకు చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వకుండా రూ.73 లక్షల అవినీతికి పాల్పడిన డీసీఎంఎస్‌ అధికారులు, అధికార పార్టీ నాయకులు, దళారులపై చట్టపరమైన చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటయ్య సోమవారం రాష్ట్ర లోకాయుక్తకు విజ్ఞప్తి చేశారు. డీసీఎంఎస్‌ అధికారులు, ఽఅధికార పార్టీ కౌన్సిలర్‌తో పాటు మరికొందరు కుమ్మక్కై వారు పండించని కంది పంటను పండించినట్లుగా, డీసీఎంఎస్‌ కేంద్రంలో అమ్మని కంది పంటను అమ్మినట్లుగా దొంగ బిల్లులను డీసీఎంఎస్‌ అధికారుల నుంచే తీసుకుని కందులు విక్రయించిన అసలు రైతులైన 123 మందికి రావాల్సిన రూ.73 లక్షలను వారందరూ కలిసి మింగేశారని ఆయన లోకాయుక్త దృష్టికి తీసుకువచ్చారు.


కందులు విక్రయించిన రైతులకు కాకుండా నకిలీ రైతుల పేరిట బిల్లులు చేసిన విషయాన్ని గుర్తించిన కొందరు డీసీఎంఎస్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేకపోయిందని వివరించారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌ దృష్టికి ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. కందుల కొనుగోళ్లలో రైతుల పేరిట అక్రమాలకు పాల్పడిన వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటయ్యతో పాటు ఆ సంఘం నాయకులు చందు, రమేష్‌ ఉన్నారు. 

Updated Date - 2020-10-20T06:30:59+05:30 IST