మాటలు కాదు... ఆచరణ ప్రధానం!

ABN , First Publish Date - 2020-10-30T06:04:59+05:30 IST

దేవుడి నామాన్ని నిరంతరం జపించే వాళ్ళు మన చుట్టూ చాలామంది కనిపిస్తారు. అయితే వారిలో ఎంతమంది దైవం నిర్దేశించిన మార్గాన్ని నిజాయతీగా అనుసరిస్తున్నారో ఆత్మపరిశీలన చేసుకోవాలి. ‘దేవుణ్ణి ఎప్పుడూ తలచుకుంటూ ఉంటాం...

మాటలు కాదు... ఆచరణ ప్రధానం!

దేవుడి నామాన్ని నిరంతరం జపించే వాళ్ళు మన చుట్టూ చాలామంది కనిపిస్తారు. అయితే వారిలో ఎంతమంది దైవం నిర్దేశించిన మార్గాన్ని నిజాయతీగా అనుసరిస్తున్నారో ఆత్మపరిశీలన చేసుకోవాలి. ‘దేవుణ్ణి ఎప్పుడూ తలచుకుంటూ ఉంటాం... కాబట్టి మేము గొప్ప విశ్వాసులం’ అని వారు భావించినా, ఇతరులను నమ్మించే ప్రయత్నం చేసినా అది ఆత్మద్రోహమే కాదు, దైవద్రోహం కూడా! ఇలాంటి వారు ఏసు ప్రభువు కాలంలో కూడా ఉన్నారు. తాను చెప్పిన వాటిని పాటించడమే విశ్వాసం తప్ప పదే పదే తనను పిలవడం, తన పేరు జపించడం కాదనీ ఆయన స్పష్టం చేశాడు. ‘‘నేను చెప్పే వాటిని మీరు పాటించకుండా ‘ప్రభువా! ప్రభువా!’ అని పదే పదే నన్ను ఎందుకు పిలుస్తున్నారు? నా దగ్గరకు ఎందరో వస్తున్నారు. నా మాటలు వింటున్నారు. వాటిని ఆచరణలో పెట్టే మనుషులు ఎలా ఉంటారో చెబుతాను వినండి. అలాంటి విశ్వాసులు నేలను లోతుగా తవ్వి, రాతిమీద పునాది వేసి, ఇల్లు కట్టుకున్న వ్యక్తిలా ఉంటారు. వరద వచ్చినప్పుడు, పెద్ద తరంగాలు ఆ ఇంటిని ఢీకొడతాయి, కానీ ఆ ఇల్లు కదలదు. ఆ ఇంటి నిర్మాణం చక్కగా జరిగింది కాబట్టి కెరటాలు దాన్ని ఏమీ చెయ్యలేవు.


నా మాటలు విన్న తరువాత కూడా వాటిని పాటించని వ్యక్తి నేల మీద పునాది వెయ్యకుండా ఇల్లు కట్టుకున్న మనిషిలాంటి వాడు. ఆ ఇంటిని నదీ ప్రవాహం వచ్చి ఢీకొట్టగానే కూలిపోతుంది. పూర్తిగా నాశనమైపోతుంది’’ అని హెచ్చరించాడు (లూకా సువార్త: 46-49). దైవ బోధనలను తెలుసుకొని, వాటిని ఆచరణలో పెట్టే వారి జీవితం స్థిరంగా, ఎలాంటి ఆటుపోట్లూ లేకుండా సాగుతుంది. పైపై మాటలతో కాలం వెళ్ళబుచ్చే వారికి ఎదురుదెబ్బలు తప్పవు. అందుకే దైవం పట్ల విశ్వాసాన్నీ, భక్తినీ మాటల్లో కాకుండా ఆచరణలో చూపాలి. దైవాన్ని ప్రసన్నం చేసుకొనే మార్గం అదే!

Updated Date - 2020-10-30T06:04:59+05:30 IST