రాత్రి ఆహారం ఆలస్యమైతే...

ABN , First Publish Date - 2021-06-08T15:27:36+05:30 IST

ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం? ఈ అంశాల మీదే మన శరీర బరువు ఆధారపడి ఉంటుంది. రాత్రుళ్లు మరీ ఆలస్యంగా భోజనం చేసే అలవాటు ఉంటే, బరువు పెరిగే సమస్య కూడా పెరుగుతుంది

రాత్రి ఆహారం ఆలస్యమైతే...

ఆంధ్రజ్యోతి(08-06-2021)

ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం? ఈ అంశాల మీదే మన శరీర బరువు ఆధారపడి ఉంటుంది. రాత్రుళ్లు  మరీ ఆలస్యంగా భోజనం చేసే అలవాటు ఉంటే, బరువు పెరిగే సమస్య కూడా పెరుగుతుంది అనే మాట వింటూ ఉంటాం. కానీ నిజానికి శాస్త్రీయంగా ఈ విషయాన్ని నిరూపించే ఆధారాలు లేవంటున్నారు పరిశోధకులు. ఏ సమయంలో రాత్రి భోజనం ముగించాం అనేది కాకుండా ఆ సమయంలో ఏం తింటున్నాం అనేది కీలకం అంటున్నారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ ఉండే సుదీర్ఘమైన వ్యవధి మూలంగా ఆకలి పెరిగి, అవసరానికి మించి, కొంత ఎక్కువగా తినేస్తూ ఉంటాం. అలాగే రాత్రి పూట భోజనాన్ని ఎంచుకునే విషయంలో ఎక్కువ మంది పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఆకలిగా ఉన్నప్పుడు పోషకాలు తక్కువగా, క్యాలరీలు ఎక్కువగా ఉండే పదార్థాల మీదకు మనసు మళ్లుతుంది. శీతల పానీయాలు, ఉప్పుతో కూడిన స్నాక్స్‌, స్వీట్లు తినాలనే కోరిక పెరుగుతుంది. వాటితో అవసరానికి మించిన క్యాలరీలు శరీరంలోకి చేరుకుని శరీర బరువు పెరుగుతుంది. ఇంకొందరిలో రోజు మొత్తంలో వాళ్లు ఎదుర్కొన్న ఒత్తిడి, ఆందోళనలు వారి ఆహారశైలి మీద ప్రభావం చూపిస్తాయి. ఎమోషనల్‌ ఈటింగ్‌ అనే పరిస్థితి తలెత్తి, భోజన పరిమితి మీద నియంత్రణ కోల్పోతారు. దాంతో అవసరానికి మించి తినేస్తూ ఊబకాయులుగా మారతారు. కాబట్టి రాత్రి వేళ ఆలస్యంగా తింటున్నా, ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం? అనే విషయాల పట్ల అప్రమత్తంగా ఉండడం అవసరం అంటున్నారు పరిశోధకులు.

Updated Date - 2021-06-08T15:27:36+05:30 IST