అచ్యుతాపురంలో భూ కబ్జా

ABN , First Publish Date - 2022-08-12T06:10:56+05:30 IST

అచ్యుతాపురం- పూడిమడక ప్రధాన రహదారిలో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌కు ఆనుకొని వున్న రెండు ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది.

అచ్యుతాపురంలో భూ కబ్జా
ఎక్సకవేటర్‌తో భూమిని చదును చేస్తున్న దృశ్యం

సర్వే నంబర్లు 19, 27ల్లో రెండు ఎకరాలు ఆక్రమణ

ఐదేళ్ల క్రితమే ప్లాట్లుగా విభజించి అమ్మకాలు

ప్రస్తుత మార్కెట్‌ విలువ రూ.20 కోట్లు

అక్రమార్కుల్లో ఒకరు వైసీపీ, మరొకరు బీజేపీ నాయకులు

అప్పట్లో ఓ ముఖ్య నేత అండదండలు 

చూసీచూడనట్టు వదిలేసిన రెవెన్యూ అధికారులు

తాజాగా ఆ నేతతో విభేదాలు... భూమి స్వాధీనానికి చర్యలు

లబోదిబోమంటున్న కొనుగోలుదారులు



అచ్యుతాపురం, ఆగస్టు 11: అచ్యుతాపురం- పూడిమడక ప్రధాన రహదారిలో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌కు ఆనుకొని వున్న రెండు ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. మండలంలో వైసీపీ, బీజేపీలకు చెందిన ఇద్దరు నాయకులు ఈ భూమిని ఆక్రమించి, ఇళ్ల స్థలాలుగా విభజించి విక్రయించారు. అప్పట్లో నియోజకవర్గానికి చెందిన ఓ ముఖ్య నాయకుడి అండదండలతో భూకబ్జాకు పాల్పడ్డారు. అయితే భూ ఆక్రమణదారుల్లో ఒకరైన వైసీపీ నాయకుడికి, సదరు ముఖ్య నేతకు మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో కన్నెర్రజేసిన ఆ ముఖ్యనేత... ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ అధికారులకు హుకుం జారీ చేశారు. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి. 

అచ్యుతాపురం సర్వే నంబరు 27లో 1.22 ఎకరాలు ప్రభుత్వ పోరంబోకు భూమిగా, సర్వే నంబర్‌ 19లో 79 సెంట్లు ప్రభుత్వ భూమిగా (రోడ్డు) రెవెన్యూ రికార్డుల్లో నమోదై ఉంది. అచ్యుతాపురానికి చెందిన వైసీపీ నాయకుడు, బీజేపీకి చెందిన మరో నాయకుడు కలిసి సుమారు ఐదేళ్ల క్రితం ఈ భూమిని ఆక్రమించారు. వీరికి ఎలమంచిలి నియోజకవర్గానికి చెందిన ఒక ముఖ్యనేత అండదండలు వున్నాయి. అప్పట్లో ఈ భూమిని డి.పట్టాగా ఒక నిరుపేదకు మంజూరు చేయించి, అతనిని నుంచి వైసీపీ, బీజేపీ నాయకులు కొనుగోలు చేసినట్టు రికార్డులు (ఎన్‌వోసీ) సృష్టించారు. అనంతరం లేఅవుట్‌గా మార్చేసి ఒక్కొక్కటి ఎనిమిది సెంట్లు చొప్పున 15 ప్లాట్లు వేశారు. సెంటు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు విక్రయించారు. రిజిస్ట్రేషన్‌కు ఎటువంటి అభ్యంతరాలు లేకపోవడంతో కొనుగోలుదారులకు అనుమానం రాలేదు. తరువాత కొన్ని స్థలాలు పలువురి చేతులు మారాయి. ఎవరూ ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేదు. కొనుగోలుదారుల్లో ఒకరు షెడ్డు నిర్మించుకోగా, మరొకరు కమ్మల పాక వేసుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ సెంటు రూ.10 లక్షలు పలుకుతున్నది.

ముఖ్యనేతతో విభేదాలు... భూమి స్వాధీనానికి ఆదేశాలు

నియోజవర్గానికి చెందిన ముఖ్యనేత సందర్భానుసారం రాజకీయ పార్టీలు మారుతుంటారు. గతంలో ఈ నాయకుడు ఒక జాతీయ పార్టీలో వుండేవారు. భూకబ్జాదారుల్లో ఒకరు అప్పట్లో ఈ నేతకు చాలా సన్నిహితంగా వుండేవారు. ముఖ్యనేత ఏ పార్టీలో వుంటే, ఇతను కూడా ఆ పార్టీలో చేరేవాడు. ప్రస్తుతం వీరిద్దరూ అధికార వైసీపీలో వున్నారు.  దీంతో ముఖ్యనేత అండదండలతో ప్రభుత్వ భూమిని కబ్జాచేసి, లేఅవుట్‌ వేసి దర్జాగా విక్రయించారు. అయితే కొద్దిరోజుల క్రితం ముఖ్యనేతపై వైసీపీకి చెందిన కొంతమంది నాయకులు అవినీతి ఆరోపణలు చేశారు. వీరికి అచ్యుతాపురానికి చెందిన నాయకుడు (ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వ్యక్తి) నేతృత్వం వహించి ముఖ్యనేత ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో సర్వే నంబర్లు 19, 27ల్లో వున్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ అధికారులకు ఆయన హుకుం జారీ చేశారు.  

 

అది ప్రభుత్వ భూమి... స్వాధీనం చేసుకుంటున్నాం

వై.శ్రీనివాసరావు, తహసీల్దార్‌ 

సర్వే నంబర్లు 19, 27ల్లో గల సుమారు రెండు ఎకరాల భూమి ప్రభుత్వానికి చెందినది. దీనిని స్వాధీనం చేసుకొని చదును చేయిస్తున్నాము. అందులో ఒక రేకుల షెడ్డు, ఒక కమ్మల పాక వున్నాయి. వీటిని తొలగించడానికి ఆయా వ్యక్తులకు కొంత సమయం ఇచ్చాము. ఈ భూమిని ప్రభుత్వ అవసరాలకు వినియోగిస్తాము. 


Updated Date - 2022-08-12T06:10:56+05:30 IST