సాధించినవేమీ లేకనే... అబద్దపు ప్రచారాలు
ABN , First Publish Date - 2022-05-16T06:29:53+05:30 IST
జాతీయ సంఘాలు గుర్తింపు సంఘాలుగా పనిచేసిన కాలంలో కార్మికులకు సాధించిన హక్కులేమీలేవని, ఎన్నికల ముందు అబద్దపు ప్రచారానికి తెరతీశాయని టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్ విమర్శించారు.
- టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావ్
యైటింక్లయిన్కాలనీ, మే 15: జాతీయ సంఘాలు గుర్తింపు సంఘాలుగా పనిచేసిన కాలంలో కార్మికులకు సాధించిన హక్కులేమీలేవని, ఎన్నికల ముందు అబద్దపు ప్రచారానికి తెరతీశాయని టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్ విమర్శించారు. ఆదివారం ఓసీపీ-3 సీహెచ్పీలో జరిగిన గేట్మీటింగ్లో ఆయన మాట్లాడారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం 60కి పైగా హక్కులను సాధించిందని, సాధించిన వాటిని కార్మికులకు తెలియజెప్పే క్రమంలో తాము ఏం చేశామో చెప్పలేని స్థితిలో జాతీయ సంఘాలు ఉన్నాయన్నారు. కార్మికుల్లో ఉనికి కాపాడుకోడానికి అబద్దపు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. జాతీయ సంఘాలు పెండింగ్లో పెట్టిన 3,400 డిపెండెంట్లతో పాటు కారుణ్య నియామకాల కింద 10వేల మందికి ఎక్స్టర్నల్ నోటిఫికేషన్ల ద్వారా 3,800 పైచిలుకు ఉద్యోగాలు ఇప్పించిన ఘనత టీబీజీకేఎస్కే దక్కుతుందన్నారు. 20 లక్షల మ్యాచింగ్ గ్రాంట్, కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్యం వంటి హక్కులు సాధించి కార్మికుల మన్ననలు పొందామన్నారు. కోల్ ఇండియాలో బొగ్గు బ్లాక్లను వేలం వేస్తున్నా జాతీయ సంఘాలు ఆందోళనలు చేయలేదని, సింగరేణిలో మాత్రం టీబీజీకేఎస్ను బద్నాం చేయడం సిగ్గుచేటన్నారు. మారుపేర్లతో ఉన్న కార్మికుల సమస్యను త్వరలోనే పరిష్కరించినున్నట్టు వెంకట్రావ్ తెలిపారు. గేట్మీటింగ్లో నాయకులు అయిలి శ్రీనివాస్, సత్యనారాయణరెడ్డి, దేవ వెంకటేశం, ఐ సత్యం, శంకర్నాయక్, బానాకర్, ఎట్టం కృష్ణ, అక్రమ్, బేతి చంద్రయ్య, శ్రీనివాసరెడ్డిలు పాల్గొన్నారు.