సీఎం జగన్‌కు అచ్చెన్నాయుడు లేఖ

ABN , First Publish Date - 2022-05-07T16:52:19+05:30 IST

అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అచ్చెన్నాయుడు లేఖ రాశారు.

సీఎం జగన్‌కు అచ్చెన్నాయుడు లేఖ

అమరావతి: అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అచ్చెన్నాయుడు లేఖ రాశారు. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులకు అకాల వర్షాలు మనోవేదనకు గురిచేశాయన్నారు. పలు ప్రాంతాల్లో చేతికొచ్చిన వరి, మిర్చి, మామిడి, నిమ్మ, సపోటాతో పాటు ఇతర ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. గత మూడేళ్లుగా అన్నదాతలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారన్నారు. ఓ వైపు గిట్టుబాటు ధరలు లేక.. మరోవైపు ప్రకృతి విపత్తులతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి ఏర్పడిందని లేఖలో తెలిపారు.


రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.4 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల నిధి ఏర్పాటు మాటలకే పరిమితమైందని విమర్శించారు. గత మూడేళ్లలో 9 తుఫాన్ల ధాటికి సుమారు 50 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయన్నారు. దాదాపు 20వేల కోట్ల పంట నష్టం జరగగా.. ప్రభుత్వం ఇచ్చిన పరిహారం 10 శాతం కూడా దాటలేదని తెలిపారు. ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులకు పరిహారం అందించి అన్నివిధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు లేఖలో పేర్కొన్నారు. 

Read more