అచ్చెన్న, గణేష్పై వైసీపీ దుష్ప్రచారాన్ని ఖండించిన చంద్రబాబు
ABN , First Publish Date - 2020-02-22T02:13:17+05:30 IST
అచ్చెన్నాయుడు, వాసుపల్లి గణేష్పై వైసీపీ నేతల దుష్ప్రచారాన్ని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. టీడీపీ బీసీ నేతల్ని..
గుంటూరు: అచ్చెన్నాయుడు, వాసుపల్లి గణేష్పై వైసీపీ నేతల దుష్ప్రచారాన్ని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. టీడీపీ బీసీ నేతల్ని టార్గెట్ చేయడం హేయమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలంటే వైఎస్ జగన్కు చిన్నచూపని, బీసీ నేతలు ఎదగడాన్ని జగన్ సహించలేడని చంద్రబాబు వ్యాఖ్యానించారు. బలహీనవర్గాల గొంతు నొక్కేందుకే కౌన్సిల్ రద్దుపై తీర్మానం చేశారని చెప్పారు. 31 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, ఎమ్మెల్సీలుగా ఉండటాన్ని జగన్ ఓర్వలేకపోయారన్నారు. బీసీలపై ద్వేషంతోనే ఆదరణ పథకం రద్దు చేశారని తెలిపారు. కార్పొరేషన్ల నిధులన్నీ దారి మళ్లించి స్వాహా చేశారన్నారు. తుగ్గక్ నిర్ణయాలను అసెంబ్లీలో అచ్చెన్న, గణేష్ ఎండగట్టారని చెప్పారు. జగన్ అవినీతి బురదలో పూర్తిగా కూరుకుపోయాడన్నారు. ఆ బురద టీడీపీ నేతలకు అంటించాలని కుతంత్రాలు చేస్తున్నారని మండిపడ్డారు. సాక్షి అబద్ధాల మీడియాగా జగన్ అసెంబ్లీలోనే చెప్పారన్నారు. అవినీతిలో పుట్టిన మీడియా సాక్షి ఛానల్, పేపర్, అవినీతిపై రాయడం హాస్యాస్పదమని చంద్రబాబు విమర్శించారు.