వరలక్ష్మి హత్య కేసులో నిందితులను శిక్షించాలి

ABN , First Publish Date - 2022-01-17T05:45:49+05:30 IST

మన్నెంపల్లికి చెందిన వరలక్ష్మి అనే అమ్మాయిని హత్య చేసిన నిందితులకు త్వరగా శిక్షపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకొవాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్‌ చేశారు.

వరలక్ష్మి హత్య కేసులో నిందితులను శిక్షించాలి
మన్నెంపల్లిలో బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్న మందకృష్ణ

-ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ 

తిమ్మాపూర్‌, జనవరి 16: మన్నెంపల్లికి చెందిన వరలక్ష్మి అనే అమ్మాయిని హత్య చేసిన నిందితులకు త్వరగా శిక్షపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకొవాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన మన్నెంపల్లిలోని భాధితరాలి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో వరలక్ష్మి హత్యకేసును ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో విచారించి నిందితులకు శిక్ష పడేలా చేయాలని డిమాండ్‌ చేశారు. వరలక్ష్మి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లరెడ్డిపేట మండలం అల్మస్‌పూర్‌లో ఓ బాలిక మీద అత్యాచారం చేసిన నిందితుడు రాదారపు శంకర్‌కు ఇచ్చిన బెయిల్‌ను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాదారపు శంకర్‌ అధికార పార్టీకి సంబందించిన నాయకుడు, మంత్రి కేటీఆర్‌కు అనుచరుడు కావడంతో పోలీసులు కేసు నమోదు చేసినా నామమాత్రపు సెక్షన్లు పెట్టి బెయిల్‌ కోసం పరోక్షంగా సహకరించారని విమర్శించారు.  నిందితుడి బెయిల్‌ రద్దు చేయించేందుకు పోలీసులు పై కోర్టుకు వెళ్లాలని, లేకపోతే దళిత, గిరిజన సంఘాలను కలుపుకుని నిందితుడి బెయిల్‌ రద్దు చేయించేందుకు హైకోర్టుకు వెళతామన్నారు.  కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర నాయకులు బోయిని కొమురయ్య, మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య, ఎమ్మార్పీఎస్‌ జిల్లా ఇన్‌చార్జి ఇంజిమ్‌ వెంకటస్వామి, నాయకులు మారంపల్లి శ్రీనివాస్‌, ఎంఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షులు మాతంగి రమేష్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి గోష్క అజయ్‌, దండు అంజయ్య, అనిల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-01-17T05:45:49+05:30 IST