పోలీసుకు తోడుగా.. ఆర్టీసీ వలంటీర్లు

ABN , First Publish Date - 2020-04-03T09:19:33+05:30 IST

రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) కృష్ణా రీజియన్‌లో ఉద్యోగ, కార్మికులు వలంటీర్లుగా సేవలు అందిస్తున్నారు.

పోలీసుకు తోడుగా.. ఆర్టీసీ వలంటీర్లు

రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) కృష్ణా రీజియన్‌లో ఉద్యోగ, కార్మికులు వలంటీర్లుగా సేవలు అందిస్తున్నారు. కరోనా మహమ్మారిపై పోరాటంలో ప్రాణాలను పణంగా పెట్టి క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న వైద్య , పోలీసు సిబ్బందికి సహకారాన్ని ఇచ్చేందుకు జిల్లా వ్యాప్తంగా గురువారం ఆర్టీసీ సిబ్బంది వలంటీర్లుగా సేవలు అందించారు. పోలీసుస్టేషన్ల వద్ద పోలీసులకు సహకారంగా.. వారు చెప్పిన చోట విధులు నిర్వహించారు. ప్రజలను బయటకు రానివ్వకుండా రోడ్లపై ఉండి వారిని నిలువరించారు. రైతుబజార్ల వద్ద రద్దీని క్రమబద్ధీకరించారు. మార్కెట్ల వద్ద రద్దీ లేకుండా చర్యలు చేపట్టారు. స్టోర్స్‌, ఏటీఎం ల వద్ద విధులు నిర్వహించారు. ఆర్టీసీ ఉద్యోగ, కార్మికులకు వలంటీర్లుగా బాధ్యతలు అప్పగించటంలో గుంటూరులో మాదిరిగా జిల్లాలో వ్యవహరించలేదు. చాలా పరిమితంగానే సిబ్బందిని తీసుకున్నారు.


మహిళా సిబ్బందికి మినహాయింపునిచ్చారు. సేవ చేయటానికి వచ్చిన మహిళా సిబ్బందిని తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా వెయ్యి మంది లోపు సిబ్బందికి వలంటీర్ల బాధ్యతలు అప్పగించారు. నగరంలో 400 మంది సిబ్బందికి విధి నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. గురువారం శ్రీరామనవమి అరునా వలంటీర్లు ఆయా పోలీసు స్టేషన్లకు చేరుకుని హౌస్‌ ఆఫీసర్లను కలుసుకుని రిపోర్టు చేశారు. ఆర్టీసీ యాజమాన్యం సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లను మాత్రం అందించలేదు.   -ఆంధ్రజ్యోతి, విజయవాడ

    





Updated Date - 2020-04-03T09:19:33+05:30 IST