కాలువలో విద్యాసామగ్రి వాహనం బోల్తా
ABN , First Publish Date - 2022-07-04T05:10:49+05:30 IST
విద్యాసామగ్రితో వెళ్తున్న ఓ వాహనం కనిగిరి రిజర్వాయర్ సదరన్ చానల్లో బోల్తాకొట్టిన సంఘటన ఆదివారం ఉదయం జరిగింది.
తడిసిన బ్యాగులు, నిఘంటువులు
డ్రైవర్కు తప్పిన ప్రాణాపాయం
బుచ్చిరెడ్డిపాళెం, జూలై 3: విద్యాసామగ్రితో వెళ్తున్న ఓ వాహనం కనిగిరి రిజర్వాయర్ సదరన్ చానల్లో బోల్తాకొట్టిన సంఘటన ఆదివారం ఉదయం జరిగింది. నెల్లూరు సర్వశిక్ష అభియాన్ కార్యాలయం నుంచి కలిగిరి, వింజమూరు, దుత్తలూరు మండలాల్లోని పాఠశాలలకు చెందిన విద్యా సామగ్రి తో రెండు వాహనాలు బయలుదేరాయి. జొన్నవాడ మీదుగా వెళ్తూ విద్యాసామగ్రి అన్లోడు చేసే నిమిత్తం అన్నారెడ్డిపాళెంలో కూలీల కోసం వెళాయి. అక్కడ నుంచి కనిగిరి రిజర్వాయర్ వద్ద ఉండే హైవే మీదకు వస్తున్నాయి. సదరన్ చానల్ దొంగతూము వద్దకు వచ్చే సరికి వెనుక వస్తున్న ఒక వాహనం అదుపుతప్పి సదరన్ (చానల్)కాలువలో బోల్తా పడింది. వాహనంలోని బ్యాగులు, నిఘంటువులు(డిక్షనరీలు) తడిసిపోయాయి. ప్రమాదం నుంచి డ్రైవర్ బయటపడ్డాడు. అనంతరం అతను ఇచ్చిన సమాచారంతో ఎస్ఎస్ఏ అడిషన్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సీహెచ్ ఉషారాణి, సీఎంవో కమ్యూనిటీ మొబలైన్ అధికారి భాస్కర్రెడ్డి. బుచ్చి ఎంఈవో దిలీప్కుమార్, సీఆర్పీ ఎస్. మల్లేశ్వర్రెడ్డి అన్నారెడ్డిపాళెం, దువ్వూరు సీఆర్పీలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారి వంతు సహాయ సహకారాలందించారు. కాలువలో పడిన వాహనాన్ని క్రేన్తో వెలికితీయించారు. తడిసిన నిఘంటువులు , బ్యాగులను మరో వాహనంలో తరలించారు. ప్రమాదంలో 1నుంచి 5తరగతుల వరకు పంపిణీ చేయాల్సిన డిక్షనరీలు కొంత దెబ్బతినగా 6నుంచి 10వ తరగతుల వరకు పంపిణీ చేయాల్సిన డిక్షనరీలు ప్యాకింగ్ పటిష్టంగా వుండడంవల్ల తడిసిపోలేదని ఎంఈవో దిలీప్కుమార్, సీఆర్పీ మల్లేశ్వరరెడ్డి తెలిపారు.