ప్రమాదాల నివారణ అందరి బాధ్యత
ABN , First Publish Date - 2021-11-30T05:38:38+05:30 IST
సింగరేణిలో ప్రమాదాలు నివారించడం అందరి బాధ్యత అని, భవిష్యత్లో ప్రమాదాలు జరుగకుండా కలిసికట్టుగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని డైరెక్టర్(పా) బలరాంనాయక్ అన్నారు.
- సింగరేణి డైరెక్టర్ (పా) బలరాంనాయక్
గోదావరిఖని, నవంబరు 29: సింగరేణిలో ప్రమాదాలు నివారించడం అందరి బాధ్యత అని, భవిష్యత్లో ప్రమాదాలు జరుగకుండా కలిసికట్టుగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని డైరెక్టర్(పా) బలరాంనాయక్ అన్నారు. సోమవారం స్థానిక ఇల్లందు క్లబ్లో కంపెనీ లెవల్ రక్షణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సింగరేణి డైరెక్టర్లు, జీఎంలు, అధికారులు, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులతో పాటు జాతీయ సంఘాల నాయకులు హాజరయ్యారు. సింగరేణి సీఎండీ ఆదేశాల మేరకు సింగరేణి కంపెనీ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ శ్రీరాంపూర్, మందమర్రిలో జరిగిన ప్రమాదాలను సీరియస్గా తీసుకున్న సీఎండీ భవిష్యత్లో ప్రమాఆలు జరుగకుండా చేపట్టిన చర్యలపై అన్ని సంఘాలతో సమావేశం నిర్వహించి వారి సలహాలు, సూచనలు తీసుకోవడం జరిగిందన్నారు. రక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నప్పటికీ ప్రమాదా లు తరచుగా జరుగుతున్నాయని, ఎక్కువగా రూఫ్ ఫాల్, సైడ్ వాల్ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. జాతీయ స్థాయి కోల్మైన్స్లోని జియలాజికల్ పరిస్థితుల్లో తేడా ఉండడం, గ్రేడియెంట్ ప్లాట్ కావడం వల్ల తక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఇక్కడ స్టెప్ గ్రేడియెంట్ ఉండడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అక్కడ ఓసీల ద్వారా 95శాతం బొగ్గు వస్తుందని, యూజీల ద్వారా 5శాతం బొగ్గు వస్తుందన్నారు. సింగరేణిలో ఓపెన్కాస్టుల ద్వారా 86శాతం బొగ్గు వస్తుందని, యూజీల ద్వారా 16శాతం వస్తుందని చెప్పారు. ప్రమాదాలు జరుగకుండా ఏ విధమైన రక్షణ చర్యలు పెంపొందించాలని, దీనిపై కార్మికసంఘాల సూచనలు, సలహాలు తీసుకుని సింగరేణి సీఎండీకి నివేదిక అందించనున్నట్టు తెలిపా రు. ఈ నివేదికను విశ్లేషించిన తరువాత సంస్థలో ప్రమాదాలు జరుగకుండా పటిష్టమైన రక్షణ చర్యలను అమలు చేస్తామని చెప్పారు. అదే విధంగా షిఫ్టు సమయాని కన్నా ముందు సీనియర్ అధికారులు పని స్థలాలను పరిశీలించి అక్కడ పూర్తిస్థాయిలో రక్షణ ఉందని భావిస్తేనే పనులకు అనుమతిస్తామని చెప్పారు.
- ఉత్పత్తిపై ఉన్న శ్రద్ధ..
ఏడాది కాలంగా తరచూ సింగరేణిలో ప్రమాదాలు జరిగి అనేక మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారని, రక్షణ సూత్రాలను పటిష్టంగా అమలు పరిచి ప్రమాదాలు నివరించాలని పలు కార్మిక సంఘాలు విజ్ఞప్తి చేశాయి. యాజమాన్యానికి ఉత్పత్తిపై ఉన్న శ్రద్ధ కార్మికుల ప్రాణాలపై లేదని, 1956 నుంచి 2020వరకు 12రక్షణ త్రైపాక్షిక సమావేశాలు జరిగాయన్నారు. ఆ సమావేశాల్లో జాతీయ, అంతర్జాతీయ బొగ్గు గనుల్లో అమలవుతున్న రక్షణ చర్యలను, గతంలో కోయగూడెంలో ఉపయోగించడం వల్ల నాలుగు సంవత్సరాలు ప్రమాదాలు లేని గనిగా అవార్డులు సాధించిందన్నారు. సంస్థ నాణ్యమైన రక్షణ పరికరాలు కొనుగోలు చేయాలని, ఆరోగ్యంగా ఉన్న వారిని సేఫ్టీ కమిటీలో వేయాలని సూచించారు.
సమావేశంలో డైరెక్టర్(ఆపరేషన్స్) చంద్రశేఖర్, డైరెక్టర్(ఈఅండ్ఎం) సత్యరాయణరావు, ఆర్జీ-1 జీఎం కల్వల నారాయణ, సేఫ్టీ జీఎం గురువయ్య, టీబీజీకేఎస్ అధ్యక్షుడ వెంకట్రావ్, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, నాయకులు కొత్త సత్యనారాయణరెడ్డి, దేవ వెంకటేశం, కెంగర్ల మల్లయ్య, ఏనుగు రవీందర్రెడ్డి, వీరభద్రయ్య, కాపు కృష్ణ, ఏఐటీయూసీ నాయకులు సీతారామయ్య, షేక్ సాదిక్, ఐఎన్టీయూసీనాయకులు జనక్ ప్రసాద్, నర్సింహారెడ్డి, హెచ్ఎంఎస్ నాయకులు రియాజ్ అహ్మద్, బీఎంఎస్ నాయకులు యాదగిరి సత్తయ్య, పేరం రమేష్, సీఐటీయూ నాయకులు రాజిరెడ్డి, రాజగోపాల్ పాల్గొన్నారు.