రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

ABN , First Publish Date - 2022-08-10T06:32:38+05:30 IST

దుర్గగుడి టోల్‌గేట్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా మరో యువకుడు తీవ్ర గాయాలకు గురైన సంఘటన సోమవారం రాత్రి 12.20 గంటలకు జరిగింది.

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

మరో యువకుడికి గాయాలు

వన్‌టౌన్‌, ఆగస్టు 9 : దుర్గగుడి టోల్‌గేట్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా మరో యువకుడు తీవ్ర గాయాలకు గురైన సంఘటన సోమవారం రాత్రి 12.20 గంటలకు జరిగింది. మృతుడు తండ్రి సయ్యద్‌ ఖాజా ఫిర్యాదు మేరకు మంగళవారం వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. గిరిపురం గరిమెళ్ల నాగిరెడ్డి వీధిలో సయ్యద్‌ ఖాజా భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తెతో ఉంటున్నాడు. ఇతను డ్రైవర్‌గా పని చేస్తుండగా భార్య ఇంటి వద్దే టైరింగ్‌ చేస్తోంది. కుమారులిద్దరూ ఎన్టీఆర్‌ కాంప్లెక్స్‌ వద్ద సెల్‌ఫోన్‌ మెకానిక్‌గా పని చేస్తున్నారు. పెద్ద కుమారుడు సయ్యద్‌ రియాజ్‌, చిన్న కుమారుడు ఫయాజ్‌ రోజూ ఇంటి నుంచి ఆటోలో ఎన్టీఆర్‌ కాంప్లెక్స్‌కు వెళ్లి రాత్రి వేళలో తిరిగి ఆటోలో వస్తారు. సోమవారం రాత్రి రియాజ్‌ పనులు ముగించుకుని ఇంటికెళ్లాడు. ఫయాజ్‌ రాలేదేమని అడగటంతో 8 గంటలకు ఇంటికి వెళుతున్నానని చెప్పాడని తండ్రికి చెప్పాడు. అర్ధరాత్రి 2 గంటలకు రెహమాన్‌ అనే వ్యక్తి ఖాజా ఇంటికి వెళ్లి రసూల్‌, ఫయాజ్‌ మోటర్‌ సైకిల్‌పై ప్రయాణిస్తూ దుర్గగుడి టోల్‌గేట్‌ సమీపంలో డివైడర్‌ను ఢీకొన్నారని చెప్పాడు. వెంటనే ఖాజా ప్రభుత్వాసుపత్రికి వెళ్లి చూడగా ఫయాజ్‌ ఐసీయూలో ఉన్నాడు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం 8.30 గంటలకు చనిపోయాడు. ఈ సంఘటనలో రసూల్‌కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Updated Date - 2022-08-10T06:32:38+05:30 IST