స్తంభాన్ని ఢీకొని.. కారు బోల్తా!
ABN , First Publish Date - 2022-05-23T05:42:21+05:30 IST
స్తంభాన్ని ఢీకొని.. కారు బోల్తా!
చికిత్స పొందుతూ ఒకరి మృతి ..మరొకరికి తీవ్ర గాయాలు..ముగ్గురికి స్వల్ప గాయాలు
ఆకివీడు, మే 22: ఐదుగురు స్నేహితులు ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో కారులో వెళుతుండగా జాతీయ రహదారిపై బాలాజీ రైస్మిల్ దగ్గర విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు. దీంతో కారు బోల్తాపడింది. ఇద్దరికి తీవ్రగాయాలు, ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. 108లో భీమవరం ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ.. అందులో ఒకరు మరణించారు. దుంపగడపకు చెందిన బొర్రా బేశ సాయి(24), ముద్దే దుర్గాప్రసాద్(26), ఆకివీడుకు చెందిన మాంతి కరుణాకర్(24), మంగళగిరికి చెందిన కాగిత లక్ష్మణరావు (25), గజ్జలకొండ రవితేజ(24) దుంపగడప నుంచి బయలుదేరి..ఆకివీడులో రిలయన్స్ బం కు దగ్గర మారుతి రిజ్ కారులో డీజిల్ కొట్టించుకొన్నారు. అరకిలో మీట రు వెళ్లాక జాతీయ రహదారికి పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని డ్రైవింగ్ చేస్తున్న కరుణాకర్ వేగంగా వెళ్లి ఢీకొన్నాడు. కారు పల్టీ కొట్టింది. సమీ పంలోని కళ్యాణమండపంలో పెళ్లికి వచ్చిన వ్యక్తులు చూసి 108, పోలీసులకు సమాచారమిచ్చారు. బొర్రా బేశసాయి తలకు తీవ్ర గాయమవ్వగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ముద్దే దుర్గా ప్రసాద్ కంటికి తదితర చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. కరుణాకర్, లక్ష్మణ్రావు, రవితేజకు స్వల్పగాయాలయ్యాయి. మృతుడి సోదరుడు బొర్రా కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో హెడ్కానిస్టేబుల్ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పొంతనలేని సమాధానాలు
ఆదివారం ఫంక్షన్ ఉండడంతో పనులపై తిరుగుతున్నామని తమకు చెప్పారని పోలీసులు చెబుతుండగా, స్వల్ప గాయాలైన ఒక వ్యక్తిని ఫోన్లో అడగ్గా..ఆకివీడులో తమను ఇంటి దగ్గర దింపి వెళ్లడానికి వస్తున్నారని చెప్పారు. అందరూ కలిసి అరకు బయలుదేరారని భీమవరం ఆస్పత్రి దగ్గర బాధితులు దగ్గరకు వచ్చిన బంధువులు స్నేహితులు తెలిపినట్లు అంబులెన్స్ సిబ్బంది చెబుతున్నారు.