జీడిమెట్లలో ఘోర ప్రమాదం
ABN , First Publish Date - 2020-06-02T10:10:00+05:30 IST
జీడిమెట్లలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. ఇద్దరు వ్యక్తులు
ట్రక్కును ఢీకొట్టిన కారు
ఒకరి దుర్మరణం
ఇద్దరికి తీవ్రమైన గాయాలు
జీడిమెట్ల, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): జీడిమెట్లలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. షాపూర్నగర్కు చెందిన సింగోర్తి యాదగిరి అలియాస్ గిరి(45), కుత్బుల్లాపూర్ కుర్మబస్తీకి చెందిన నార్లకంటి ప్రతాప్(45), సుభా్షనగర్కు చెందిన శివాల వీర్శెట్టి(52) స్నేహితులు. వీరంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. వీర్శెట్టికి జహీరాబాద్లో ఐరన్స్టీల్ గోదాం ఉంది.మూడు రోజుల క్రితం గాలివానకు షెడ్డు కూలిపోయింది. గత నెల 31వ తేదీ ఉదయం 10 గంటలకు గిరి, ప్రతాప్, వీర్శెట్టి కారు(టీఎస్08 ఎఫ్డి1346)లో జహీరాబాద్ వెళ్లారు. అక్కడ పని చూసుకొని రాత్రికి పటాన్చెరు నుంచి ఓఆర్ఆర్ మీదుగా దుండిగల్ చేరుకొని షాపూర్నగర్ వైపు వస్తున్నారు. ప్రతాప్ కారు నడుపుతుండగా.. ముందు సీట్లో వీర్శెట్టి, వెనుక సీట్లో యాదగిరి కూర్చున్నారు. సూరారం దాటి జీడిమెట్ల వైపు వెళ్తుండగా మైలాన్ కంపెనీ ఎదురుగా ఉన్న మూలమలుపు వద్ద లోడ్తో ఉన్న ట్రక్కు(ఏపీ 09 టీఏ 2161) పారిశ్రామికవాడలోకి వెళ్లడానికి మలుపు తిరుగుతోంది.
వేగంగా వచ్చిన కారు ట్రక్కును ఢీకొట్టింది. కారు నుజ్జునుజ్జయింది. వెనుక సీట్లో కూర్చున్న యాదగిరి తలకు బలమైన గాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బెలూన్లు తెరుచుకున్నాయి. ముందు సీట్లో కూర్చున్న ప్రతాప్ కుడిచేయి, తలకు బలమైన గాయాలయ్యాయి. వీర్శెట్టి కుడికాలు విరిగిపోయింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. యాదగిరి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ట్రక్కు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. అందరితో కలుపుగోలుగా ఉండే యాదగిరి మృతితో షాపూర్నగర్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ముగ్గురు వ్యక్తులు మద్యం మత్తులో ఉండడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు అంటున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.