వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
ABN , First Publish Date - 2021-02-27T06:33:05+05:30 IST
నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు.
నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. మదాపూర్లో వెయిటర్, బంజారాహిల్స్లో ల్యాబ్ టెక్నీషియన్, గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. ఆయా పోలీస్స్టేషన్ల పరిధుల్లో కేసులు దర్యాప్తులో ఉన్నాయి.
మదాపూర్లో వెయిటర్..
మాదాపూర్, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): రెస్టారెంట్లో పనిచేస్తున్న ముగ్గురు పని ముగించుకొని ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. మాదాపూర్ ఎస్ఐ రామ్మోహన్రెడ్డి తెలిపిన ప్రకారం.. బిహార్కు చెందిన సుమన్ కుమార్యాదవ్(25) ఇనార్బిట్మాల్లోని చట్నీస్ రెస్టారెంట్లో వెయిటర్గా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి 11 గంటలకు విధులు ముగించుకుని తోటి పనివారితో కలిసి ద్విచక్రవాహనంపై దుర్గంచెరువు మార్గంలో ఇంటికి వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో ద్విచక్రవాహనం నడుపుతున్న వ్యక్తితో పాటు మరో వ్యక్తి కింద పడిపోయారు. సుమన్కుమార్ కుడివైపు పడగా తలపై నుంచి లారీ చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బంజారాహిల్స్లో ల్యాబ్ టెక్నీషియన్..
బంజారాహిల్స్, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): డివైడర్ను ఢీకొట్టి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఉప్పుగూడకు చెందిన ఎస్. దయానంద్(37) ఒయాసిస్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. శుక్రవారం విధులకు బైక్పై బయలుదేరిన దయానంద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో డివైడర్ను ఢీకొట్టాడు. తీవ్రమైన గాయాలవడంతో అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి భార్య వనజ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గాంధీలో చికిత్స పొందుతూ ఒకరు..
దుండిగల్, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు మృతి చెందాడు. దుండిగల్ తండా-1కు చెందిన మాలోవత్ శ్రీనివాస్(25), మాలోవత్ రాజు అన్నదమ్ములు. వీరు బొంతపల్లిలోని ఓప్రైవేట్ కంపెలో పనిచేస్తున్నారు. ఈనెల 25 రాత్రి 9.30గంటలకు బొంతపల్లి నుంచి బైక్పై దుండిగల్ తండాకు వెళ్తన్నారు. గాగిల్లాపూర్ వద్దకు వెళ్లగానే బైక్ చైన్ శబ్ధం వస్తుండడంతో రాజు బైక్ను రోడ్డు పక్కన ఆపి చూస్తున్నాడు. శ్రీనివాస్ రోడ్డుపక్కన నడుచుకుంటూ వెళ్తుండగా వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన శ్రీనివా్సను గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెదాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.