ఆగి ఉన్న బస్సును ఢీకొన్న లారీ

ABN , First Publish Date - 2020-12-06T05:34:46+05:30 IST

పీఎంపాలెం కార్‌షెడ్‌ జంక్షన్‌ వద్ద శనివారం తెల్లవారుజాము రెండున్నర గంటల సమయంలో ఆగివున్న బస్సును లారీ ఢీకొనడంతో 16 మందికి గాయాలయ్యాయి.

ఆగి ఉన్న బస్సును ఢీకొన్న లారీ
ప్రమాదంలో దెబ్బతిన్న లారీ

లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

స్వల్పంగా గాయపడిన 15 మంది బస్సు ప్రయాణికులు

కొమ్మాది, డిసెంబరు 5: పీఎంపాలెం కార్‌షెడ్‌ జంక్షన్‌ వద్ద శనివారం తెల్లవారుజాము రెండున్నర గంటల సమయంలో ఆగివున్న బస్సును లారీ ఢీకొనడంతో 16 మందికి గాయాలయ్యాయి. పీఎంపాలెం సీఐ రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం పీఎంపాలెం కార్‌షెడ్‌ జంక్షన్‌ దాటాక బరంపురం నుంచి 30 మంది ఒడిశాకు చెందిన ప్రయాణికులతో వస్తున్న ఓ ప్రైవేటు బస్సు పార్సిల్‌ను దింపే నిమిత్తం  ఆగింది. అదే సమయంలో సాలూరు నుంచి వలస కూలీలతో వస్తున్న ఓ లారీ వెనుక నుంచి బస్సును ఢీకొనడంతో బస్సు అదుపు తప్పి పక్కనున్న సర్వీస్‌ రోడ్డులోకి పల్టీ కొట్టింది. అలాగే లారీ డివైడర్‌ను దాటుకుని ఆనందపురం వైపు వెళ్లే జాతీయ రహదారిపై నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో లారీడ్రైవర్‌కు కాళ్లు విరిగిపోగా, బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 15 మందికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం పోలీసులు కేజీహెచ్‌, గీతం, ప్రథమ ఆస్పత్రులకు తరలించారు. అనంతరం ట్రాఫిక్‌కు అంతరాయం వాటిల్లకుండా క్రేన్‌ సహాయంతో వాహనాలను తొలగించారు. సీఐ రవికుమార్‌ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-12-06T05:34:46+05:30 IST