కారును ఢీకొట్టి అంబులెన్స్ బోల్తా
ABN , First Publish Date - 2021-04-16T06:57:17+05:30 IST
డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడంతో అంబులెన్స్ఓ కారును ఢీకొట్టి బోల్తాపడింది.
రోగులు ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం
ఖైరతాబాద్ ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడంతో అంబులెన్స్ఓ కారును ఢీకొట్టి బోల్తాపడింది. అందులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటన తెలుగుతల్లి చౌరస్తా రోడ్డులో గురువారం జరిగింది. సైఫాబాద్ ఎస్ఐ రవి తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం 1.50 గంటలకు ఎంజీ హెక్టార్ కారు (టీఎస్ 09 ఎఫ్పీ 0657) లుంబినీ పార్కు నుంచి ఎమ్మెల్యే క్వార్టర్స్ వైపు వెళ్తోంది. అంబేడ్కర్ విగ్రహం నుంచి ఇక్బాల్ మినార్ వైపు వెళ్తున్న ప్రైవేటు అంబులెన్స్ (టీఎస్ 05 యూసీ 0534) తెలుగుతల్లి చౌరస్తా వద్ద సిగ్నల్ జంప్ చేసి ముందు వెళ్తున్న ఎంజీ కారును ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారు, అంబులెన్స్ డ్రైవర్లు రోహిత్, ఎన్. యాదయ్య స్వల్ప గాయాలతో బయటపడ్డారు. నిర్లక్ష్యంగా అంబులెన్స్ను నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు అంటున్నారు. కారు ముందు భాగం దెబ్బతిన్నది. కేసు దర్యాప్తు చేస్తున్నారు.