ఊపందుకున్న వ్యాక్సినేషన్
ABN , First Publish Date - 2021-01-19T06:02:26+05:30 IST
టీకా కార్యక్రమం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సోమవారం ఊపందుకుంది. 34 కేంద్రాల్లో టీకా కార్యక్రమంలో రెండో రోజైన సోమవారం 1109 మందికి వ్యాక్సినే షన్ పూర్తయ్యింది.
ఉమ్మడి జిల్లాలో రెండో రోజు 1109 మందికి టీకా
34కు పెరిగిన టీకా కేంద్రాలు
నల్లగొండఅర్బన్/ యాదాద్రి / సూర్యాపేట, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): టీకా కార్యక్రమం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సోమవారం ఊపందుకుంది. 34 కేంద్రాల్లో టీకా కార్యక్రమంలో రెండో రోజైన సోమవారం 1109 మందికి వ్యాక్సినే షన్ పూర్తయ్యింది. భయాలు,భ్రమలు క్రమంగా తొలగిపోతున్నాయి. దుష్ప్రభావం లేకపోవడంతో టీకా వేయించుకునేందుకు పారిశుధ్య, వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది ఉత్సాహం చూపిస్తున్నారు. అధికారులు నిర్ధేశించిన మేరకు కార్యక్రమం సజావుగా సాగుతోంది. నల్లగొండ జిల్లాలో ఈ నెల 16న టీకా ప్రారంభమైన మొదటి రోజున 90 మందికి వేశారు. సోమవారం టీకా కేంద్రాలను పెంచి 18 కేంద్రాల్లో 563మందికి వ్యాక్సిన్ వేశారు. మొత్తం రెండురోజుల్లో కలిసి 653 మందికి టీకా వేశారు. జిల్లాకు ఇప్పటి వరకు 328 కోవిషీల్డ్ వాయిల్స్ వచ్చాయి. ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్ ఇంకా 2347 మందికి సరిపోతుంది. చందంపేట పీహెచ్సీలో 27మందికి టీకా వేయాల్సి ఉంది. ఎవరూ ముందుకు రాలేదు. దీంతో వైద్యాధికారి విజయ టీకా వేయించుకుని వారికి భరోసా ఇవ్వడంతో అందరూ టీకా వేయించుకున్నారు. అదేవిధంగా యాదాద్రి జిల్లాలో మొదటి రోజు మూడు కేంద్రాల్లో 90మందికి టీకాలు వేయగా, సోమవారం మరో మూడు కేంద్రాలను పెంచి 240 మందికి టీకా వేశారు. జిల్లా కేంద్ర ఆసుపత్రి, రామన్నపేట పీహెచ్సీ, ఆలేరు మండలం షారాజీపేట పీహెచ్సీలో కొత్తగా టీకాలు ప్రారంభించారు. జిల్లాకు ఇప్పటి వరకు 1660 డోసుల టీకాలు సరఫరా జరిగినట్టుగా అధికారులు తెలిపారు. అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో మొదటి రోజు మూడు కేంద్రాల్లో 90 మందికి టీకా వేయగా, రెండో రోజు కొత్తగా ఏడు కేంద్రాలను పెంచి 306 మందికి టీకా వేశారు.