ఎస్సీ, ఎస్టీ కేసుల దర్యాప్తు వేగవంతం చేయండి
ABN , First Publish Date - 2021-10-24T06:08:25+05:30 IST
ఎస్సీ, ఎస్టీ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని ఆర్డీవో జె.సీతారామారావు ఆదేశించారు.
ఆర్డీవో సీతారామారావు
తుమ్మపాల, అక్టోబరు 23: ఎస్సీ, ఎస్టీ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని ఆర్డీవో జె.సీతారామారావు ఆదేశించారు. మండల పరిషత్ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన సబ్ డివిజనల్ విజిలెన్స్ మోనటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. విజిలెన్స్ మోనటరింగ్ కమిటీ సభ్యులు ప్రతి నెలా 30న దళిత వాడల్లో సమావేశాలు నిర్వహించి ప్రజల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. దళిత వాడల్లో విద్య ప్రాధాన్యతను వివరించేలా అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో చట్టాలు దుర్వినియోగం కాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఫిర్యాదుదారులకు అందాల్సిన రాయితీలు, కుల ధ్రువీకరణ పత్రాలు సమయానికి అందించేలా చొరవ చూపాలన్నారు. ప్రతి కేసును క్షుణ్ణంగా విచారణ చేపట్టి నిజాలను నిర్ధారించాలని ఆదేశించారు. తప్పుడు కేసులు, ఫిర్యాదుదారులను ప్రోత్సహించరాదన్నారు. కాగా, కుల వివక్షత చూపిస్తున్న అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని తుమ్మపాల సర్పంచ్ తట్టా పెంటయ్యనాయుడు సమావేశంలో డిమాండ్ చేశారు. సర్పంచ్ లేకుండానే అధికారిక కార్యక్రమాలను పంచాయతీ ఈవో నిర్వహిస్తున్నారని అధికారుల దృష్టికి ఆయన తీసుకువెళ్లారు. కార్యక్రమంలో డీఎస్పీ బి.సునీల్, పట్టణ సీఐ ఎల్.భాస్కరరావు, డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.