ఇళ్ల నిర్మాణాలు వేగవంతం
ABN , First Publish Date - 2021-08-04T05:13:30+05:30 IST
పేదల ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని జేసీ మయూర అశోక్ ఆదేశించారు. మంగళవారం స్థానిక మునిసిపల్ కార్యాలయంలో ఇళ్ల నిర్మాణాలపై నియోజకవర్గస్థాయిలో సమీక్షించారు.
సాలూరు : పేదల ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని జేసీ మయూర అశోక్ ఆదేశించారు. మంగళవారం స్థానిక మునిసిపల్ కార్యాలయంలో ఇళ్ల నిర్మాణాలపై నియోజకవర్గస్థాయిలో సమీక్షించారు. ఈ నెలాఖరు నాటికి బేసిమెంట్ లెవల్కు నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు. ముఖ్య అతిథి గా హాజరైన ఎమ్మెల్యే రాజన్నదొర మాట్లాడుతూ... రాష్ట్రంలో సుమారు 30 లక్షల ఇళ్ల నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కొండలపై గిరి జనులు చేపడుతున్న ఇళ్ల నిర్మాణాలను అటవీశాఖ అధికారులు ఎందుకు అడ్డుకుంటున్నారో అర్థం కావటం లేదన్నారు. పక్కన ఒడిశాలో నచ్చిన విధంగా నిర్మాణాలు చేపడుతున్నా పట్టించు కోని ఆ శాఖ అధికారులు ఇక్కడే ఎందుకు అడ్డుకుంటున్నారో తెయడం లేదని తెలిపారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు చెప్పారు. అనంతరం జేసీ వెంకటరావు ఒక్కో మండలంలో ఇళ్ల నిర్మాణంపై పురోగతిని ఆయా అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో తహసీల్దార్లు, ఎంపీడీవోలు, హౌసింగ్ పీడీ ఎస్వీ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. దత్తిరాజేరు : పేదల కాలనీల్లో గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలని మండల ప్రత్యేకాధికారి, ఆత్మ పీడీ ఎ.అశోక్కుమార్ సూచించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమీక్షించారు. ఈ నెలాఖరునాటికి పునాదులు పూర్తి చేయాలని సూచించారు. ఇళ్ల నిర్మాణాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని తెలిపారు. హౌసింగ్ ఏఈ పి.ఉమామహేశ్వరరావు, ఎంపీడీవో ఎంవీ సుబ్రహ్మణ్యం, తహసీల్దార్ ఎ.సులోచనరాణి, ఆర్డబ్ల్యూఎస్ జేఈ శైలజ తదితరులు పాల్గొన్నారు.