ప్రయాణం.. విషాదం

ABN , First Publish Date - 2022-01-28T06:09:23+05:30 IST

ఉన్నత చదువులకు చిన్నకుమారుడిని విదేశాలకు పంపి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, పెద్దకుమారుడు మృతి చెందారు.

ప్రయాణం.. విషాదం
సౌదా వెంకట్రావు, ప్రసన్నకుమార్‌(ఫైల్‌ ఫొటో)

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం 

చిలకలూరిపేటకు చెందిన తండ్రి, కుమారుడు మృతి

చిన్న కుమారుడ్ని విమానం ఎక్కించి వస్తుండగా ఘటన

చిలకలూరిపేట, జనవరి 27: ఉన్నత చదువులకు చిన్నకుమారుడిని విదేశాలకు పంపి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, పెద్దకుమారుడు మృతి చెందారు. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున ప్రకాశం జిల్లా జె.పంగులూరు మండలం జాగర్లమూడివారిపాలెం వద్ద జరిగింది.  ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం రుద్రవరం నుంచి ముప్పై ఏళ్ల క్రితం మూడు కుటుంబాలు చిలకలూరిపేట వచ్చి స్థిరపడ్డాయి. వారిలో మూడోవాడైన సౌదా వెంకట్రావు, కళావతి దంపతులు చిలకలూరిపేట పండరీపురం మంచినీటి ట్యాంకుల ఎదురు కిరాణా దుకాణం ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వెంకట్రావు దంపతులకు ప్రసన్నకుమార్‌, భాస్కర్‌ ఇద్దరు కుమారులు.  పెద్ద కుమారుడైన ప్రసన్నకుమార్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కాగా చిన్నకుమారుడు భాస్కర్‌ను ఉన్నత చదువులకు అమెరికాలోని న్యూయార్క్‌ పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. హైదరాబాద్‌లో ఉంటున్న భాస్కర్‌ న్యూయార్క్‌ వెళ్లేందుకు నేరుగా చెన్నై వెళ్లాడు. బుధవారం మధ్యాహ్నం వెంకట్రావు, కళావతి, పెద్దకుమారుడు ట్రావెల్స్‌ కారులో చెన్నై వెళ్లి భాస్కర్‌ను విమానం ఎక్కించి అదే కారులో తిరిగి చిలకలూరిపేటకు వస్తున్నారు. ఈ క్రమంలో  జాతీయ రహదారిపై వీరు ప్రయాణిస్తున్న కారు  జాగర్లమూడివారిపాలెం ఫ్లైఓవర్‌ సమీపంలో ముందు వెళుతున్న సుబాబుల్‌ ట్రాక్టర్‌ను ఢీకొంది. దీంతో వెంకట్రావు(55), ప్రసన్నకుమార్‌(26) అక్కడికక్కడే మృతి చెందారు. కళావతి షాక్‌కు గురైంది. డ్రైవర్‌ ప్రాణాలతో బయపడ్డాడు. 

వెనుతిరిగిన చిన్న కుమారుడు 

విమానంలో బయల్దేరిన భాస్కర్‌కు  అబుదాబి వెళ్లేప్పటికి ప్రమాదం విషయం  తెలిసింది. ఆనందంతో ఉన్నత చదువులకు వెళుతున్న అతడు  వెనుతిరిగాడు. వెంకట్రావు, కళావతి దంపతులు చిలకలూరిపేటలోని సాంబశిగనర్‌, సుగాలికాలనీ ప్రాంతవాసులకు సుపరిచితులు. కిరాణా దుకాణం కావడంతో పట్టణంలోని మార్కెట్‌ ప్రాంతవాసులకు కూడా ఆయన బాగా తెలిసిన వ్యక్తి. ప్రయాణంలో ఉన్నప్పుడే వెంకట్రావు ఉదయం 4:30 గంటలకు మార్కెట్‌లో హోల్‌సేల్‌ దుకాణదారుడికి ఫోన్‌ చేసి కూరగాయలు ఆర్డర్‌ చెప్పాడని ఆ తర్వాత గంటకే  మృతి చెందాడన్న సమాచారం తెలిసి వ్యాపారులు దిగ్ర్భాంతికి గురయ్యారు. పెద్దకుమారుడు ప్రసన్నకుమార్‌కు కూడా వివాహం చేసేందుకు సంబంధాలు చూస్తున్నారు. ఇంతలోనే విధి వారి కుటుంబంపై కన్నెర్రజేసింది.  


Updated Date - 2022-01-28T06:09:23+05:30 IST