ఏసీబీ వలలో కోటేశ్వరరావు
ABN , First Publish Date - 2020-02-20T09:18:44+05:30 IST
సర్వే శాఖ లో అవినీతి తిమింగలం ఎట్టకేలకు ఏసీబీ వలలో చిక్కింది. కోటేశ్వర రావు అంటేనే పైసలివ్వందే ఏమీ చేయరనే పేరుంది.
రూ. కోట్లు గడించిన అవినీతి సర్వేయర్
సర్వే నివేదిక కోసం రూ.7 లక్షలు డిమాండ్
రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
అక్రమార్జనే ధ్యేయంగా విధులు
అనంతపురం కార్పొరేషన్, ఫిబ్రవరి19 : సర్వే శాఖ లో అవినీతి తిమింగలం ఎట్టకేలకు ఏసీబీ వలలో చిక్కింది. కోటేశ్వర రావు అంటేనే పైసలివ్వందే ఏమీ చేయరనే పేరుంది. నగరపాలక సంస్థలో సర్వేయర్గా పనిచేస్తున్న ఈయన బుధవారం రూ.7 లక్షలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. నగరానికి చెందిన సోము ప్రసాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. నగర శివార్లలో వెంచర్లలో ప్లాట్లు వేసి విక్రయిస్తుంటాడు. ఈ క్రమంలో నగర శివారులోని రుద్రంపేట బైపాస్ పక్కనున్న గౌరవ్హోమ్స్ సమీపంలోని సర్వే నెంబర్ 1.117/1ఏ లో 38 సెంట్ల భూమిపై సర్వే కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆ స్థలంలో సర్వే చేసిన సర్వేయర్ కోటేశ్వరరావు రిపోర్ట్ ఇవ్వలేదు. నివేదిక కావాలంటే రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఆఖరుకు రూ.7 లక్షలకు బేరం కుదిరింది. అయితే అంత డబ్బు లంచం ఇవ్వడం ఇష్టంలేని సోము ప్రసాద్ ఈ విషయంపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. కోటేశ్వరరావు సూచించిన మేరకు బుధవారం రాత్రి 7గంటల సమయంలో నగరంలోని టవర్క్లాక్ సమీపంలో ఉన్న డీవీఎన్ బిల్డర్స్ కార్యాలయానికి సోము ప్రసాద్ వచ్చాడు. ఇదే క్రమంలో అక్కడికి కోటేశ్వరరావు తన అసిస్టెంట్ శివతో కలిసి వచ్చాడు. కోటేశ్వరరావు అడిగిన మేరకు సోము ప్రసాద్ తనతో పాటు తెచ్చుకున్న రూ.7 లక్షలను సర్వేయర్కు అందజేశాడు. అక్కడే పొంచి ఉన్న ఏసీబీ డీఎస్పీ అల్లాబకాష్, సీఐ ప్రభాకర్ సిబ్బందితో కలిసి సర్వేయర్ కోటేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు.
కోటేశ్వరరావు....‘కోటే’్లశ్వరరావుగా ఎదిగిన తీరిదీ !
సర్వేయర్ కోటేశ్వరరావు మొదటి నుంచి అక్రమా ర్కుడిగా పేరు పొందాడు. పైసలు లేనిదే సర్వే చేయరన్న విమర్శలు ఆది నుంచి ఉన్నాయి. చిన్న పాటి స్థలానికి కూడా రూ.20 వేలకుపైగా లంచం ఇవ్వనిదే సర్వే చేయ రన్న ఆరోపణలున్నాయి. 2001 నుంచి అనంతపురం కార్పొ రేషన్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈయన 1996లో సర్వేశాఖలో డిప్యూటీ సర్వేయర్గా విధుల్లో చేరాడు. అ క్రమార్జనే ధ్యేయంగా అంచెలంచెలుగా ఎదిగాడు. ప్రతి మూడు, నాలుగేళ్లకు బదిలీ అయ్యే సందర్భంలో డిప్యు టేషన్పై మరొకరిని ఆ స్థానంలో నియమించడం... మరో మూడు నెలల్లో ఈయనే మళ్లీ ఇక్కడకు రావడం ఈయ నకు పరిపాటిగా మారింది. ఇలా దాదాపు 20 ఏళ్లుగా అనంతపురం కార్పొరేషన్లోనే తిష్ట వేశాడు. ఇతని అసి స్టెంట్ శివను చిన్న విషయాల్లో సర్వే కోసం పంపేవాడు. గత కొన్నేళ్లలోనే రూ.కోట్లకు పడగలెత్తినట్లు విశ్వసనీయ సమాచారం. కుటుంబ సభ్యులతోపాటు బినామీ పేర్లతో ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లుగా కూడా ఏసీబీ అఽధికారులకు సమాచారం అందడంతో ఆ కోణంలోనూ విచారణ కొనసాగించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. పూర్తి స్థాయిలో విచారణ చేస్తే కళ్లు బైర్లు కమ్మే అక్రమాలు బయటపడే అవకాశాలు లేకపోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సర్వేయర్ కోటేశ్వర రావు, సహాయకుడు శివను గురువారం కర్నూలు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ అల్లాబకాష్ పేర్కొన్నారు.