ధూళిపాళ్ల బెయిల్ రద్దు కోరుతూ హైకోర్టులో ఏసీబీ పిటిషన్
ABN , First Publish Date - 2021-06-18T23:40:09+05:30 IST
సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర బెయిల్ రద్దు కోరుతూ హైకోర్టులో ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది. నిబంధనలు ఉల్లంఘించారని ఏసీబీ వాదనలు వినిపించింది.
అమరావతి: సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర బెయిల్ రద్దు కోరుతూ హైకోర్టులో ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది. నిబంధనలు ఉల్లంఘించారని ఏసీబీ వాదనలు వినిపించింది. ప్రతివాదులకు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 23కు హైకోర్టు వాయిదా వేసింది. ధూళిపాళ్ల నరేంద్ర, ఎండీ గోపాలకృష్ణన్లకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దర్యాప్తు అధికారులు ఇప్పటికే అవసరమైన దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారని, పిటిషనర్లు కరోనా బారినపడి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నందున బెయిల్ ఇస్తున్నట్లు పేర్కొంది.
బెయిల్ నిమిత్తం విజయవాడలోని ఏసీబీ కోర్టులో పిటిషనర్లు ఇద్దరూ రూ.లక్ష చొప్పున రెండు పూచికత్తులు సమర్పించాలని ఆదేశించింది. బెయిల్పై విడుదలైన తేదీ నుంచి 4 వారాల పాటు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి దాటి బయటకు వెళ్లకూడదని స్పష్టం చేసింది. పిటిషనర్లు నివాసం ఉండే చిరునామాను ఏసీబీ అధికారులకు ఇవ్వాలని సూచించింది. దర్యాప్తులో భాగంగా పిటిషనర్లను విచారించాలని అధికారులు భావిస్తే 24 గంటల ముందు నోటీసులు జారీ చేయాలని స్పష్టంచేసింది.