విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2020-10-20T07:12:01+05:30 IST
విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకులు సోమవారం డీఈఓకు వినతిపత్రాన్ని అందజేశారు
ఏసీసీ, అక్టోబరు 19: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకులు సోమవారం డీఈఓకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ విభాగ్ కన్వీనర్ పోశెట్టి అశ్విన్రెడ్డి మాట్లాడారు. కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు ఆన్లైన్ క్లాస్ల పేరుతో పాఠ్యపుస్తకాలను, యూనిఫాంలను తమ వద్దనే కొనుగోలు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులకు ఇబ్బందులకు గురిచేస్తున్నాయని చెప్పారు. కరోనా కష్టకాలంలో కూడా దోపిడీ చేస్తున్నాయని ఆరోపించారు. ముఖ్యంగా నారాయణ విద్యా సంస్థల పేరుతో జిల్లా కేంద్రంలో గౌతమబుద్ధ పాఠశాల ద్వారా అడ్మిషన్లకు తెరలేపుతున్నారని తెలిపారు. నారాయణ విద్యాసంస్థకు మంచిర్యాలలో ఏ విధమైన అనుమతి, గుర్తింపు గానీ లేదని చెప్పారు. శ్రీ చైతన్య కార్పొరేట్ విద్యాసంస్థ విద్యార్థులకు ఆన్లైన్ క్లాస్లు బోధిస్తున్నామనే సాకుతో స్టడీ మెటీరియల్ తమ వద్దనే కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నదని అన్నారు.
మెటీరియల్ కొనని యెడల విద్యార్థులు చదువులో వెనుకబడుతారని తల్లిదండ్రులను పక్కదారి పట్టిస్తూ వారిచేత దాదాపు రూ.10 వేల విలువైన స్టడీ మెటీరియల్ కొనుగోలు చేయిస్తున్నారని ఆయన విమర్శించారు. పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించడం లేదని చెప్పారు. ఒక్కో సబ్జెక్టుకు ఒక టీచర్తోనే ఆన్లైన్ క్లాస్లను అన్ని తరగతులకు చెప్పిస్తున్నారని అన్నారు. అయినప్పటికీ వారికి చెల్లించాల్సినటువంటి జీతంలో సగం మాత్రమే అందజేస్తూ ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి దుర్గం వినయ్, నగర కన్వీనర్ సాయి, నగర ఉపాధ్యక్షుడు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.