పక్కాగా కర్ఫ్యూ

ABN , First Publish Date - 2021-05-06T05:36:58+05:30 IST

కర్ఫ్యూ తొలిరోజైన బుధవారం జిల్లాలో పక్కాగా అమలైంది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలయ్యే సరికి దుకాణాలన్నీ మూతపడ్డాయి.

పక్కాగా కర్ఫ్యూ
నిర్మానుష్యంగా ఉన్న ఆ ర్టీసీ కాంప్లెక్స్

తొలిరోజు నూరుశాతం విజయవంతం

12 గంటలకల్లా మూతపడిన దుకాణాలు

నిలిచిన వాహనాలు

నిర్మానుష్యంగా రహదారులు

అత్యవసర పనులపై బయటకు వచ్చిన వారికి

గుర్తింపుకార్డులు, ధ్రువపత్రాలు పరిశీలించిన మీదట పోలీసుల అనుమతులు

తొలిరోజు కౌన్సెలింగ్‌కే పరిమితం


విశాఖపట్నం, మే 5 (ఆంధ్రజ్యోతి): కర్ఫ్యూ తొలిరోజైన బుధవారం జిల్లాలో పక్కాగా అమలైంది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలయ్యే సరికి దుకాణాలన్నీ మూతపడ్డాయి. జనాలు కూడా ఆ సమయానికే ఇళ్లకు చేరిపోయారు. జాతీయ రహదారిపై అక్కడక్కడా వాహనాలు కనిపించాయి. పోలీసులు వారిని ఆపి కారణాలు అడిగి తెలుసుకుని, గుర్తింపుకార్డు, ధ్రువపత్రాలను పరిశీలించిన తర్వాత పంపించేశారు. తొలిరోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, ప్రశాంతంగా కర్ఫ్యూ అమలైందని నగర పోలీస్‌ కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా తెలిపారు.

కరోనా ఉధృతికి అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో బుధవారం నుంచి రెండు వారాలపాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం రోజుకు పద్దెనిమిది గంటల (మధ్యాహ్నం 12 నుంచి మరుసటిరోజు ఉదయం 6 గంటల వరకూ)పాటు కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. ఈ మేరకు నగర పోలీసులు ముందుగానే కార్యాచరణ రూపొందించుకుని అమలుచేశారు. ఉదయం 11 గంటల నుంచే మైక్‌లతో కర్ఫ్యూ నిబంధనలను వివరించడంతోపాటు 12 గంటలకల్లా దుకాణాలు మూసివేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో నగరంలోని అన్ని దుకాణాలు, షాపింగ్‌మాల్స్‌, హోటళ్లు మధ్యాహ్నం 12 గంటలకల్లా మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు కూడా ఆ సమయానికి డిపోలకు చేరిపోయాయి. ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలు కూడా నిలిచిపోయాయి. దీంతో  12 గంటలకు జాతీయ రహదారితోపాటు నగరంలోని ప్రధాన రోడ్లు, బీచ్‌రోడ్డు నిర్మానుష్యంగా కనిపించాయి. ఆ తర్వాత పోలీసులు నగరంలోని అన్ని కూడళ్ల వద్ద స్టాపర్లు, బారికేడ్లను ఏర్పాటుచేసి అటుగా వచ్చే వాహనాలను తనిఖీ చేశారు. కేవలం కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు, ఆస్పత్రులు, మందుల దుకాణాలకు వెళ్లేవారిని మాత్రమే రాకపోకలు సాగించేందుకు అనుమతించారు. 


లోకల్‌ సర్వీసులకే పరిమితమైన ఆర్టీసీ

కర్ఫ్యూ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు అంతర్‌ జిల్లా సర్వీసులను బుధవారం పూర్తిగా నిలిపేశారు. కేవలం జిల్లా పరిధిలోని కొన్ని ప్రాంతాలు, నగర పరిధిలో సిటీ సర్వీసులనే నడిపారు. బుధవారం మొత్తం 250 సర్వీసులను 50 వేల కిలోమీటర్లు మాత్రమే నడిపినట్టు ఆర్టీసీ ఆర్‌ఎం వై.దానం తెలిపారు. ఇందులో 150 సిటీ సర్వీసులు కాగా మిగిలినవి అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం వంటి ప్రాంతాలకు నడిపామన్నారు.






రూరల్‌లోనూ విజయవంతం 

ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు 

మధ్యాహ్నానికి మూతపడిన దుకాణాలు 

అనకాపల్లి టౌన్‌/నర్సీపట్నం/చోడవరం/పాడేరు, మే 5: కొవిడ్‌ ఉధృతిని అరికట్టే ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ బుధవారం జిల్లాలోని రూరల్‌ ప్రాంతంలో పకడ్బందీగా అమలైంది. మధ్యాహ్నం 12 గంటలకు కాస్త ముందుగానే దుకాణాలు, హోటళ్లు మూతపడ్డాయి. ప్రజా రవాణా, ప్రైవేటు వాహనాలు నిలిచిపోయాయి. కర్ఫ్యూ నిబంధనలపై ప్రజలకు పోలీసులు అవగాహన కల్పించారు. అనకాపల్లిలో కర్ఫ్యూను జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు పర్యవేక్షించారు. అచ్యుతాపురంలో బ్రాండిక్స్‌ మూతపడగా, మిగిలిన ఫార్మా కంపెనీలు పనిచేశాయి. కర్ఫ్యూతో చోడవరం, నర్సీపట్నం, పాయకరావుపేట, నక్కపల్లి, కోటవురట్ల, ఎస్‌.రాయవరం, రోలుగుంట, పాడేరు, అరకులోయ, అనంతగిరి, ముంచంగిపుట్టు, చింతపల్లి, కొయ్యూరు, కశింకోట, ఎలమంచిలి, మునగపాక, రాంబిల్లి మండలాల్లో రహదారులు రహదారులు బోసిపోయాయి. 


ఉదయం పూట దుకాణాలకు పెరిగిన రద్దీ

మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ అమల్లోకి వస్తుందనే భావనతో నగరవాసులు తమకు కావాల్సిన సరకులు కొనేందుకు ఉదయాన్నే దుకాణాలకు పోటెత్తారు. రైతుబజార్లు,  కిరాణా దుకాణాలు, మార్కెట్లు గత పది రోజులతో పోల్చుకుంటే బుధవారం ఉదయం 11 గంటల వరకూ రద్దీగానే కనిపించాయి. మద్యం దుకాణాల ముందు మందుబాబులు క్యూ కట్టారు.  

Updated Date - 2021-05-06T05:36:58+05:30 IST