
అమరావతి: ఉగాదిని పురస్కరించుకుని తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో వైఎస్ జగన్ ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నామని చెప్పారు. మేనిఫెస్టో పేరుతో ప్రజలను మోసం చేయొద్దని ఆయన సూచించారు. మేనిఫెస్టోలో జగన్ కొత్తగా ప్రస్తావించిన అంశాలు పెద్దగా ఏమీ లేవు. నవరత్నాల్లోని అంశాలనే జగన్ మళ్లీ రిపీట్ చేశారు. కొత్తగా వైసీపీ మేనిఫెస్టోలో ఉందేంటంటే.. ప్రతీ రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం రూ.50వేలు ఇస్తామని జగన్ చెప్పారు. పంటే వేసే సమయానికే, మే నెలలోనే రూ.12,500 చొప్పున ఇస్తామని ఆయన ప్రకటించారు.
పంట బీమా గురించి రైతుల చింతించాల్సిన అవసరం లేదని, బీమా ప్రీమియంను తమ ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. కౌలు రైతులకు వడ్డీ లేని పంట రుణాలు ఇస్తామని తెలిపారు. రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తామని చెప్పారు. వ్యవసాయానికి పగటి పూటే ఉచితంగా 9గంటల కరెంటు ఇస్తామని తెలిపారు. ఆక్వా రైతులకు కరెంట్ చార్జీలు యూనిట్కు రూ.1.50కే ఇస్తామని వెల్లడించారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని జగన్ చెప్పారు. రూ.4,000 కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7లక్షల బీమా ఇస్తామన్నారు.
వార్షిక ఆదాయం రూ.5లక్షలు దాటని అన్ని వర్గాల వారికి వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం వర్తింపజేస్తామని చెప్పారు. వైద్యం ఖర్చు వెయ్యి దాటితే చాలు ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామని తెలిపారు. ఎన్ని లక్షలు ఖర్చయినా ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా వైద్యం చేయిస్తామని చెప్పారు. ప్రధాన నగరాల్లో ఎక్కడ చికిత్స చేయించుకున్నా ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామని తెలిపారు. జబ్బు చేసిన వ్యక్తి విశ్రాంతి తీసుకునే సమయంలో ఆ కుటుంబానికి ఆర్థిక సాయం కూడా చేస్తామని చెప్పారు. కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రత్యేకంగా రూ.10వేల రూపాయలు నెలనెలా ఇస్తామని జగన్ చెప్పారు. పెన్షన్ల అర్హత వయసు 65 నుంచి 60 సంవత్సరాలకు తగ్గిస్తామని తెలిపారు. పెన్షన్ రూ.3000 వరకూ పెంచుతామని చెప్పారు.
వైసీపీ మేనిఫెస్టోలోని ఇతర అంశాలు..
- ప్రతి నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజీలు
- ప్రతి నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు
- 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
- ఏటా ఉద్యోగాల క్యాలెండర్ విడుదల
- 70శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేలా చట్టం
- ప్రభుత్వ కాంట్రాక్టులు నిరుద్యోగులకు ఇచ్చేలా చట్టం
- ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ను పారదర్శకంగా అమలు
- డ్వాక్రా రుణాలు నాలుగు విడతలుగా రద్దు
- పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ రుణాలు
- మూడు దశల్లో మద్యాన్ని నిషేధం
- ఫైవ్స్టార్ హోటళ్లలో మాత్రమే మద్యానికి అనుమతి
- అగ్రిగోల్డ్ బాధితులకు రూ.1100 కోట్లు
- గొల్లలకు తిరుమల శ్రీవారి సన్నిధిలో మళ్లీ తలుపులు తెరిచే అవకాశం
- గొర్రెల కాపర్లకు రూ.6 లక్షల జీవిత బీమా
- ఎస్సీ, ఎస్టీ యువతుల పెళ్లిళ్లకు రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం
- పోడు భూములపై గిరిజనులకు యాజమాన్యం హక్కు
- గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు వాలంటీర్ నియామకం
- పేదల ఇళ్ల రుణాలను పూర్తిగా రద్దు
- ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు 2వేల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
- అర్చకుల రిటైర్మెంట్ను తొలగింపు, ఇళ్ల నిర్మాణం
- దేవాలయాల్లో దూప ఖర్చుల చెల్లింపు
- ముస్లిం యువతుల పెళ్లిళ్లకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం
- ఇమామ్, మౌజంలకు రూ.15 వేల గౌరవ వేతనం