
మన దేశంలో జాతీయ నది గంగా నది. దేశంలోని నదీ వ్యవస్థను మూడు రకాలుగా వర్గీకరించారు.
1. జీవనది వ్యవస్థ, 2. వర్షాధార నదీ వ్యవస్థ, 3. అంతర్ భూభాగ నదీ వ్యవస్థ
జీవనది వ్యవస్థ:
ఎల్లప్పుడూ నీరు ప్రవహించడం వల్ల వీటిని జీవనదులు అంటారు. ఈ నదులు నౌకాయానానికి అనుకూలమయినవి కాదు. జీవ నదులలో ముఖ్యమైనవి 1) సింధు 2) గంగ 3) బ్రహ్మపుత్ర
1. సింధూ నది
ఈ నది వల్ల మన దేశంలో మొదటి నాగరికత వెలసింది. ఈ నది పేరు మీదుగానే మన దేశాన్ని ఇండియా అని పిలుస్తున్నారు. దీని పరీవాహక ప్రాంతం 3,21,000 చ.కి.మీ. పొడవు 2,880 కి.మీ. (భారత్లో 709 కి.మీ., జమ్ము కశ్మీర్లో మాత్రమే). హిమాలయాల్లోని టిబెట్లో గల కైలాస కొండల్లోని మానస సరోవరం వద్ద 5180 మీటర్ల ఎత్తులో ఈ నది జన్మించింది. ఇది ఇండియాలో థామ్చుక్ అనేచోట ప్రవేశించి జమ్ము కశ్మీర్ మీదుగా వెళ్లి పాకిస్థాన్లో ప్రవహించి కరాచీ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఉత్తర దిశగా ప్రవహించే ఏకైక నది సింధు. ఈ నదిని ఆంగ్లంలో ఇండస్ అని, లాటిన్లో సింధస్ అని పిలుస్తారు. వివిధ భాషల్లో సింధు నదిని ఇలా పిలుస్తారు.
సంస్కృతంలో - సింధు
టిబెట్లో - సంథో కంబాట్
పర్షియన్ - హిందు
గ్రీక్లో - సింథోమ్
దీనికి రెండు రకాల ఉప నదులు ఉన్నాయి.
ఏ) పర్వత ప్రాంత ఉప నదులు
బీ) మైదాన ప్రాంత ఉప నదులు
పర్వత ప్రాంత ఉపనదులు: ఇవి పర్వతాలలో జన్మించి సింధు నదిలో ఎడమవైపున కలుస్తాయి. అవి
1) గిల్ గ్రిట్, 2) ద్రాస్
3) స్యోక్ 4) సిగ్రాక్
మైదాన ప్రాంత ఉపనదులు: ఇవి సింధు నదిలో కుడి వైపున కలుస్తాయి. అవి
1) జీలం 2) చినాబ్
3) రావి 4) బియాస్ 5) సట్లెజ్
జీలం నది:
సింధు నదికి ఉన్న ఉప నదుల్లో అతి చిన్నది. దీనిని రుగ్వేదంలో వితస్త అని పిలిచేవారు. జమ్ము, కశ్మీర్లోని వెరినాథ్ అనే ప్రాంతం దీని జన్మస్థలం. ఈ నది లడక్ జస్కర్ పర్వతాల మధ్య ఊలార్ సరస్సుల మీదుగా ప్రవహిస్తుంది. ఈ నదీ తీర నగరం శ్రీనగర్ (దాల్ సరస్సు).
చినాబ్ నది:
ఇది హిమాచల్ప్రదేశ్లోని వాశాబార్-చిహిలా కనుమల వద్ద జన్మించింది. దీని పాత పేరు అస్నికి. మన దేశంలోని ఉప నదుల్లోకెల్లా ఇది పెద్దది. చినాబ్ నదిపై జమ్ము కశ్మీర్లో ఉన్న ప్రాజెక్టులు:
ఏ) దూల్హస్తి ప్రాజెక్టు బీ) సలార్జంగ్ ప్రాజెక్టు
సీ) నబ్రాజాకీ ప్రాజెక్టు డీ) బాగ్లిహర్ ప్రాజెక్టు
రావి నది: హిమాచల్ప్రదేశ్లోని రోహ్తక్ కనుమ వద్ద ఈ నది జన్మించింది. దీన్ని పూర్వకాలంలో (రుగ్వేదంలో) ఫెరుష్ని, ఐరావతి, లాహోర్ నది అని పిలిచేవారు. పంజాబ్లో రావి నదిపై తెయిన్ డ్యామ్ నిర్మించారు.
బియాస్ నది:
ఈ నది కూడా హిమాచల్ప్రదేశ్లోని రోహ్తక్ కనుమలో జన్మించింది. సింధూ నది ఉపనదుల్లో కేవలం ఇండియాలో మాత్రమే ప్రవహించే నది బియాస్. ఇండియాలో జన్మించి, ఇండియాలోనే అంతమవుతుంది. ఈ నదిపై గల బియాస్ ప్రాజెక్టు పంజాబ్, హర్యానా, హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడి ప్రాజెక్టు. రుగ్వేదంలో ఈ నదిని విపాష అని పిలిచారు.
సట్లెజ్ నది:
టిబెట్లోని కైలాస కొండల్లో గల రాకాసి సరస్సు దీని జన్మస్థలం. సింధు ఉప నదుల్లో అత్యంత పొడవైనది, పెద్దది సట్లెజ్. మన దేశంలో అత్యధిక నీటి సదుపాయాలు కల్పిస్తున్న ఉప నది. దీని పాత పేరు శతద్రు. మూడు దేశాల మీదుగా ప్రవహించే ఏకైక సింధు ఉపనది. ఈ నదికి ఇండియాలో అత్యధిక వరద కాలువలు ఉన్నాయి. సట్లెజ్ నదిపై హిమాచల్ప్రదేశ్లో ఉన్న ప్రాజెక్టు భాక్రానంగల్ ప్రాజెక్టు ఇండియాలో మొట్టమొదటిది, అతి పెద్దది. ఈ ప్రాజెక్టు వల్ల 1204 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతుంది. ఈ ప్రాజెక్టు నిర్మించడం వల్ల హిమాచల్ప్రదేశ్లో గోవిందసాగర్ అనే అతి పెద్ద సరస్సు నిర్మితమైంది. ఇది దేశంలోనే అతి పెద్ద మానవ నిర్మిత సరస్సు. (ప్రపంచంలోనే అతి పెద్ద మానవ నిర్మిత సరస్సు ఉగాండా(ఆఫ్రికా)లోని ఓవెన్పాల్.)
బ్రహ్మపుత్ర నది:
మగవారి పేరు మీద ఉన్న ఏకైక నది బ్రహ్మపుత్ర. జీవనదుల్లో అత్యంత పురాతనమైన ఈ నది టిబెల్లోని కైలాస కొండల్లో ఉన్న షమ్-యమ్-డమ్ అనే హిమనీనదం వద్ద జన్మించి, మన దేశంలో రెండు రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది. ఈ నది అరుణాచల్ప్రదేశ్లోని జిదోబీ అనే ప్రాంతంలో దేశంలోకి ప్రవేశించి అసోంలోని దుబ్రి వద్ద బంగ్లాదేశ్లోకి ప్రవహిస్తుంది. దీని పొడవు 2900 కిలోమీటర్లు. హిమాలయాల్లో జన్మించే నదులన్నింటిలోకీ ఇది పొడవైనది. ప్రపంచంలో కెల్లా అతి పెద్ద నదీ ఆధారిత దీవి మజురి ఈ నదిపైనే ఉంది.
బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో సాంగ్ పో అని, చైనాలో జోయార్లాంగ్ , భారతదేశంలో ఎరుపు నది, బంగ్లాదేశ్లో జమున, అరుణాచల్ప్రదేశ్లో ది హంగ్, అసోంలో సైడంగ్ అని పిలుస్తారు. ఈ నదికి తరచూ వరదలు రావడం వల్ల అసోంలో అనేక ప్రాంతాలకు నష్టం కలుగుతోంది. అందువల్ల దీనిని అసోం దుఖఃదాయిని అని కూడా అంటారు. (బెంగాల్ దుఖఃదాయిని - దామోదర్, బిహార్/ భారత్ దుఖఃదాయిని - కోసి, ఆంధ్రప్రదేశ్ దుఖఃదాయిని - బుడమేరు). బంగ్లాదేశ్లోని గో ఆలిండు అనే ప్రాంతం వద్ద పద్మ నది జమున నదితో కలిసి మేఘనగా అవతరించి సాగరమాల దీవుల వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. బహ్మపుత్ర నదికి సబనసిరి, ఉత్తర ధన్సిరి, దక్షిణ ధన్సిరి, కాలి, తీస్తా, లోహిత్, మానస్, దిబంగ్, బారక, టిబెట్లు ఉపనదులు. 1871 వరకూ తీస్తా నది గంగా నదికి ఉప నది. భూకంపం కారణంగా దిశ మార్చుకుని ప్రస్తుతం బ్రహ్మపుత్ర ఉప నదిగా మారింది.