కొవిడ్ వార్డులోకి ఏబీఎన్.. ప్రాణాలకు తెగించి రిపోర్టింగ్

ABN , First Publish Date - 2021-05-06T19:29:49+05:30 IST

తిరుపతి : నగరంలోని కొవిడ్ వార్డులో సౌకర్యాలు సరిగ్గా లేక పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి..

కొవిడ్ వార్డులోకి ఏబీఎన్..  ప్రాణాలకు తెగించి రిపోర్టింగ్

తిరుపతి : నగరంలోని కొవిడ్ వార్డులో సౌకర్యాలు సరిగ్గా లేక పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. కొవిడ్ బాధితులు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ని సంప్రదించగా.. అసలు కరోనా వార్డుల్లో ఏం జరుగుతోంది..? అనే విషయంపై ప్రాణాలకు తెగించి మరీ ఫ్యాక్ట్ రిపోర్టింగ్ చేసింది. ఈ రిపోర్టింగ్‌లో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. శ్వాస ఆడకుండా ప్రభుత్వ మెటర్నిటీ కొవిడ్ ఆసుపత్రికి వెళ్తే ఆక్సిజెన్ మాస్క్ అందని పరిస్థితి ఉందని ఏబీఎన్ ద్వారా వెలుగుచూసింది. అంతేకాదు.. ఒకరి ఆక్సిజెన్ మాస్క్‌ను ఇంకొకరికి ఇవ్వడం గమనార్హం. అర్ధరాత్రి 12:30 గంటలకు కొవిడ్ ఆసుపత్రి నుంచి క్వారంటైన్‌కు మహిళలను సిబ్బంది తరలిస్తున్నట్లు తేటతెల్లమైంది.


సెలైన్ అవసరం అయినా సిబ్బంది పట్టించుకోక పోవడంతో బాధితులు భయాందోళనకు గురవుతున్నారు. రోగులకు ఇచ్చే ఆహారం పాచి పోయింది. వార్డులు, మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉన్నాయి. మరోవైపు వైద్య సిబ్బంది కూడా లంచాలు అడుగుతున్నట్లు బాధితులు చెబుతున్నారు. ఇలా పలు విషయాలు ఏబీఎన్-ఆంధ్రజ్యోతికి చెప్పి కొవిడ్ బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇకనైనా జిల్లా అధికారులు స్పందించి పైన పేర్కొన్న సమస్యలకు పరిష్కారం చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాగా.. తిరుపతి కొవిడ్ వార్డుల్లో ఇలాంటి ఆరోపణలు ఇప్పటికే కోకొల్లలుగా వచ్చాయి.

Updated Date - 2021-05-06T19:29:49+05:30 IST