దమ్మున్న ఛానెల్ ఏబీఎన్ పుష్కర ప్రస్థానంపై స్పెషల్ ఫోకస్.
ABN , First Publish Date - 2021-10-15T01:41:56+05:30 IST
సరిగ్గా పుష్కరకాలం క్రితం పురుడు పోసుకుంది ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. ముక్కుసూటి వార్తలతో ప్రజలకు దగ్గరయ్యింది. వాస్తవాల ప్రసారంతో జనం గుండెల్లో స్థానం సంపాదించుకుంది.
సరిగ్గా పుష్కరకాలం క్రితం పురుడు పోసుకుంది ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. ముక్కుసూటి వార్తలతో ప్రజలకు దగ్గరయ్యింది. వాస్తవాల ప్రసారంతో జనం గుండెల్లో స్థానం సంపాదించుకుంది. నిఖార్సయిన నైజంతో ఎన్నో ఎత్తుపల్లాలు, ఆటంకాలు చవిచూసింది. దమ్మున్నఛానెల్ పుష్కర ప్రస్థానంపై స్పెషల్ ఫోకస్.
పుష్కరాలు అత్యంత ప్రాశస్త్యం కలిగినవి. మనదేశంలో ప్రజలు ఎంతో పవిత్రంగా భావించే ఉత్సవాలు. పన్నెండేళ్లకోసారి మాత్రమే స్పృశించే అరుదైన వేడుకలు. దేశంలోని ప్రఖ్యాత నదులకు పుష్కరానికోసారి చేకూరే పవిత్రత.. భక్తులందరికీ రెట్టింపు ఆశీస్సులను అందిస్తాయన్న నమ్మకం అంతటా ఉంది. ఇప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టెలివిజన్ ఛానెల్ కూడా అలాంటి ఉత్సవాలు జరుపుకుంటోంది. ప్రజలే ప్రభువులుగా, ప్రజల డిమాండ్లు, సంక్షేమమే ఆయుధంగా పుష్కరోత్సవం జరుపుకుంటోంది. రెట్టింపు ఉత్సాహంతో.. మరింత చురుగ్గా దూసుకెళ్తూ.. వీక్షకులకు రెట్టింపు భరోసాను ఇచ్చేందుకు సిద్ధమయ్యింది.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. దమ్మున్న చానెల్. వార్తా ప్రసారాల్లో దుమ్ము రేపుతున్న ఛానెల్.. అక్రమార్కుల పాలిట గాండీవమై గర్జించే ఛానెల్. బాధితులకు భరోసా ఇచ్చే విషయంలో మనసున్న ఛానెల్. నిర్బంధాలను గుండె ధైర్యంతో ఎదుర్కొంటూ.. వాస్తవాలను వీక్షకుల చెంతకు చేరుస్తూ నిలువెల్లా సాహసాన్ని నింపుకున్న న్యూస్ ఛానెల్. చెప్పుకోవడం కాదు. ప్రజలే నిండు మనసుతో ప్రశంసల్లో ముంచెత్తుతున్న ఛానెల్. వీక్షకుల ఆశీస్సులతో, ఆదరణలతో ఈ దమ్మున్న ఛానెల్ ప్రస్థానం పుష్కరం మార్క్ చేరుకుంది.
ప్రజల హక్కు అయిన సమాచారాన్ని.. వక్రీకరించకుండా, వాస్తవ రూపంలోనే వార్తలుగా అందించే బృహత్తర బాధ్యతను తొలినుంచీ ఆచరిస్తూ అమలు చేస్తోంది ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. ధైర్యమే పెట్టుబడిగా, ఆత్మసంతృప్తే రాబడిగా.. ముందుకు దూసుకెళ్తోంది. ఆ క్రమంలోనే జనంలో 'డేర్ డెవిల్ ఇమేజ్'ను సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు ఏబీఎన్ పేరెత్తగానే దమ్మున్న ఛానెల్గా, దుమ్మురేపే ఛానెల్గా గర్వంగా చెప్పుకునే స్థాయికి చేరుకుంది.
ప్రభుత్వమైనా, పార్టీ అయినా, మఠమైనా, మందిరమైనా, సీఎం అయినా, స్వామీజీ అయినా.. ఆఖరికి రాజ్యాంగ పరమైన రక్షణల మాటున దాగి ఉన్నా.. దమ్మున్న చానెల్ దుమ్ము దులపకుండా ఉండలేదు. అలా.. సాహసమే సవ్యసాచి అయ్యింది. జనం గొంతే ఆయుధంగా ముందుకెళ్తోంది. దమ్మున్న వార్తలకు కేరాఫ్ అడ్రస్లా ఓ డెస్టినేషన్ సంపాదించింది. సామాజిక, రాజకీయ సంక్షోభాలలో ఒక దిక్సూచిగా దశా దిశా నిర్దేశం చేస్తోంది. జూలు విదిల్చి జర్నలిజాన్ని కొత్తపుంతలు తొక్కించింది. ఫలితంగా జర్నలిజంలో అంత దూకుడు, అంత సాహసం, అంతటి నిర్భీతి, అంతటి నిబద్ధత అదివరకు కనిపించలేదని విశ్లేషకుల ప్రశంసలు అందుకుంది.
వస్తేరానీ కష్టాల్ అనుకుంటుందే గానీ, సాహసాన్ని కోల్డ్ స్టోరేజీలో దాచిపెట్టలేదు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. ఈ పుష్కర ప్రస్థానంలో రెండు నిషేధాలను నిబ్బరంగా ఎదుర్కొంది. ఆ గుండె నిబ్బరానికి తోడు ఏబీఎన్ తరపున ప్రేక్షకుల పోరాటం సత్ఫలితాలిచ్చింది. నిషేధపు సంకెళ్లు పటాపంచలైపోయాయి. ఏ ఉపద్రవం ఎదురైనా ప్రజాపక్షమే వహిస్తోంది. సమ్మెలు, నిరసనలు, ఉద్యమాలు, రైతులకు సంబంధించిన సమస్యలు ఎదురైనప్పుడు వాస్తవం వైపు నిలబడి.. నిఖార్సైన సమాచార స్రవంతిని ప్రసారం చేస్తోంది ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.
జనం అభిప్రాయాన్ని నిఖార్సుగా వినిపిస్తోంది. వార్తా ప్రసారంలో, అక్రమాలు, లోగుట్టుల వెలికితీతలో సంచలనాలు సృష్టిస్తోంది. నిర్బంధాలకు భయపడబోదని ఆచరణలోనే చూపిస్తోంది. జనం అభిప్రాయాలను నిర్భీతిగా చెప్పడానికే ఉన్నామని మొదటినుంచీ నమ్ముతోంది. సమాచార స్వేచ్ఛను శ్వాసిస్తోంది. పది కిలో మీటర్ల లోతున పాతరేస్తామన్న వారితోనూ పోరాడి నిలిచింది. ఎక్కడా తత్తర పాటుకు తావు లేకుండా, ఏ సందర్భంలోనూ సహనాన్ని కోల్పోకుండా.. తనదైన ప్రమాణాలను పాటిస్తూ.. బాధ్యతను నిర్వర్తిస్తోంది ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.
తెలంగాణలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి నిర్బంధం విధించినప్పుడు, ఛానెల్ను ప్రేక్షకుల దరికి చేరకుండా అడ్డుకున్నప్పుడు నిజాయితీగా, నిర్భయంగా పోరాడింది. కోర్టు ఆదేశాల మేరకు న్యాయబద్ధంగా తిరిగి వీక్షకులను చేరుకుంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లోనూ అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రజలే చైతన్యవంతులయ్యారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కోసం జనమే రోడ్డెక్కారు. అనునిత్యం పోరాడి.. కొట్లాడి మరీ తమ ఛానెల్ ప్రసారాలను సాధించుకున్నారు.
ఏపీలో ఏబీఎన్పై అప్రకటిత నిషేధం అమలైన సమయంలో ప్రేక్షకుల ఫిర్యాదులతో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా - ట్రాయ్ ఇన్బాక్స్ నిండిపోయింది. వేల కొద్దీ వచ్చిన ఫిర్యాదులతో ఎప్పటికప్పుడు అథారిటీ వాటిని పరిష్కరించి ఏబీఎన్ ప్రసారాలను చూసే భరోసాను ప్రజలకు కల్పించింది. సమాచారం పొందే ప్రాథమిక హక్కును ప్రజలచెంతకు చేర్చింది.
-సప్తగిరి గోపగోని, చీఫ్ సబ్ ఎడిటర్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి