రోడ్డుప్రమాదంలో ABN ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్‌ దుర్మరణం

ABN , First Publish Date - 2021-12-24T14:39:47+05:30 IST

యువ జర్నలిస్ట్ ఓతూరి మధుసూదన్ శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో దర్మరణం చెందారు.

రోడ్డుప్రమాదంలో ABN ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్‌ దుర్మరణం

హైదరాబాద్: యువ జర్నలిస్ట్ ఓతూరి మధుసూదన్ శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఇంటర్నెట్ డెస్క్‌లో మధు సబ్-ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం డ్యూటీకి వస్తుండగా బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ దగ్గర ఓ ట్రక్ మధు బైక్‌ను ఢీకొట్టింది. వేగంగా వస్తున్న ట్రక్.. బైక్‌ను ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో మధుసూదన్ తలకు తీవ్రమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చి పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ప్రమాదానికి కారణమైన ట్రక్కును గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మధుసూదన్ మరణవార్త తెలుసుకున్న ‘ఏబీఎన్’, ‘ఆంధ్రజ్యోతి’ సంస్థల యాజమాన్యం, సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంటర్నెట్ డెస్క్ సిబ్బంది గాంధీ ఆసుపత్రికి తరలి వెళ్లారు.

Updated Date - 2021-12-24T14:39:47+05:30 IST