ఈ కుర్రాడి కోసం KCR అంత రిస్క్‌ తీసుకుంటారా.. ఆయన కల నెరవేరుతుందా.. మహారాష్ట్రలోనూ సేమ్‌ టూ సేమ్‌ ఎపిసోడ్‌..!?

ABN , First Publish Date - 2021-10-16T17:46:35+05:30 IST

దేవుడు వ‌ర‌మిచ్చినా పూజారి క‌రునించ‌లేద‌న్నట్లుగా ఉందట ఆయన పరిస్థితి...

ఈ కుర్రాడి కోసం KCR అంత రిస్క్‌ తీసుకుంటారా.. ఆయన కల నెరవేరుతుందా.. మహారాష్ట్రలోనూ సేమ్‌ టూ సేమ్‌ ఎపిసోడ్‌..!?

దేవుడు వ‌ర‌మిచ్చినా పూజారి క‌రునించ‌లేద‌న్నట్లుగా ఉందట ఆయన పరిస్థితి. పెండింగ్‌ పేరుతో ఎండింగ్‌ లేకుండా సాగుతున్న రాజకీయం ఆయనలో టెన్షన్‌ పుట్టిస్తోందట. పెద్ద హోదాతో సొంత ఇలాఖాకు కారులో దుమ్మురేపుకుంటూ వెళ్లాలనుకున్న సదరు యువనేతకు పదవి కన్‌ఫాం కాకపోవడం నామూషీ అనిపిస్తోందట. ఇంతకీ సిరియల్‌ కథను తలపిస్తున్న ఆ రాజకీయ రహస్యం తేలాలంటే కోర్టు మెట్లు ఎక్కితే గాని  పని అయ్యేట్లు లేదనే కొత్త టాక్‌ వినిపిస్తోంది. ఇంతకీ కుర్రాడి కోసం పెద్దాయన అంత రిస్క్‌ తీసుకుంటారా..? అసలు సంగతేంటి..? అనే విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో చూద్దాం.


ఎమ్మెల్యే అవడమే కౌశిక్ కల..!

రాజకీయాల్లో కొందరు అనూహ్యంగా షైన్‌ అవుతుంటారు. కొందరు ప్రచారంతో పేరు సంపాదించుకుంటే మరికొందరు పదవులు పొంది పేరు తెచ్చుకుంటారు. టీఆర్‌ఎస్‌ నేత పాడి కౌశిక్‌రెడ్డి ఇప్పుడు ఏ కోవలోకి వస్తారనే చర్చ జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో హుజురాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో దిగిన పాడి కౌశిక్‌రెడ్డి తాజాగా జరిగే ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీలో ఉండేందుకు  ఉవ్విళ్లూరారు. తనకే టీఆర్‌ఎస్‌ అసెంబ్లీ టికెట్‌ కన్‌ఫాం అయిందనే ప్రచారం చేసుకుని పొలిటికల్‌ సర్కిల్‌లో న్యూస్‌ క్రియేటర్‌ అయ్యారు. మొత్తానికి టీఆర్‌ఎస్‌లో చేరిన స్పోర్ట్స్‌ పర్సన్‌ కౌశిక్‌రెడ్డికి అనూహ్యంగా కేసీఆర్‌ ఎమ్మెల్సీ ఆఫర్‌ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపర్చారు. అంతవరకు బాగానే ఉన్నా రాజ్‌భవన్‌ ఇచ్చిన ట్విస్ట్‌ నుంచి ఇటు సీఎం కేసీఆర్‌ అటు కౌశిక్‌రెడ్డి తేరుకోలేకపోతున్నారనే టాక్‌ వస్తోంది.


ఈటలను ఓడించేందుకు కేసీఆర్‌ ఎత్తుగడలు..! 

పాత మిత్రుడు ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి తప్పించిన కేసీఆర్‌ హుజురాబాద్‌ ఉప ఎన్నికలో ఆయన్ను ఓడించేందుకు అన్నియుక్తులను ప్రదర్శించారు. దాంట్లో బాగంగా అన్ని పార్టీల నుంచి చేరికలను ఆహ్వానించారు. కాంగ్రెస్‌ నుంచి వచ్చిన కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీని చేసేందుకు పావులు కదిపారు. క్యాబినెట్‌ నిర్ణయాన్ని గవర్నర్ తమిళిసై కార్యాలయానికి పంపించారు. అంతే ఇక కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీ అయిపోయినట్లుగానే అందరూ బావించారు. అయితే అనూహ్యంగా గవర్నర్‌ తమిళిసై ఎమ్మెల్సీ కోటా ఫైల్‌ను పక్కన పెట్టారు. నిర్ణయాన్ని వెల్లడించడలేదు. ఫైల్‌ను వెనక్కి పంపడమూ లేదు. దీంతో టీఆర్‌ఎస్‌లో, కౌశిక్‌రెడ్డిలో రోజురోజుకీ టెన్షన్‌ క్రియేట్‌ అవుతోంది.


ఎమ్మెల్సీ హోదాలో చక్రం తిప్పాలనుకున్న కౌశిక్‌!

హుజురాబాద్‌లో లోకల్‌ హీరోగా ఎమ్మెల్సీ హోదాలో చక్రం తిప్పాలనుకున్న కౌశిక్‌రెడ్డిని గవర్నర్‌ కార్యాలయ నిర్ణయం కంగారు పుట్టిస్తోంది. సాధారణంగా గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ పదవిని సామాజికవేత్తలకు, వివిధ రంగాల్లో గుర్తింపు పొందిన వారికి ప్రపోజ్‌ చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలు తమకు తోచిన వ్యక్తులను నామినేట్‌ చేస్తూ ఫైల్స్‌ను రాజ్‌భవన్‌కు పంపిస్తున్నాయి. యువనేత కౌశిక్‌రెడ్డి ఫైల్‌ గవర్నర్‌ కార్యాలయానికి చేరి నిర్ణయం వెలువడేందుకు ఒకటి రెండు రోజులు ఆలస్యమైనప్పుడే ఏదో తేడా కొడుతుందని పొలిటికల్‌ సర్కిల్స్‌లో వినిపిస్తూ వచ్చింది. దీనికి తగ్గట్లే ఈ ఫైల్‌ పెండింగ్‌పై ప్రశ్నలు అడిగితే  గవర్నర్‌ తమిళిసై నవ్వుతూ సమాధానమిచ్చారు. పరిశీలిస్తున్నట్లు మాత్రమే చెప్పారు.


మహారాష్ట్రలోనూ సేమ్‌ టూ సేమ్‌ ఎపిసోడ్‌..!

ప‌లు సందర్బాల్లో ఈ విషయం పై రాజ్ భవన్ వర్గాలను మీడియా అరా తీసిన‌ప్పుడు స‌మాజ సేవ‌లో ఉన్నవారికి ఇచ్చే ప‌ద‌వి కాబ‌ట్టి  కౌశిక్‌రెడ్డి సేవా కార్యక్రమాలపై  విచార‌ణ చేసిన తరువాతే  నిర్ణయం తీసుకుంటామన్నట్లుగా సమాధానం వినిపిస్తోంది. అయితే  నిర్ణయం ఎప్పుడు వెలువరిస్తారనేది మాత్రం స్పష్టంగా చెప్పడం లేదు.  ఒక‌వేళ గ‌వ‌ర్నర్‌ ఫైల్‌ వెనక్కి పంపితే ప్రభుత్వం రెండోసారి అదే పేరుతో మ‌ళ్ళి ఫైల్‌ పంపితే అప్పుడు రాజ్‌భవన్‌ తప్పక ఆమోదించాల్సివ‌స్తుంది. కాని ఇక్కడ అలా  జ‌ర‌గడం లేదు. గవర్నర్ పెండింగ్‌లో  పెట్టినా ప్రభుత్వం వైపు నుంచి స్పందన కనిపించడంలేదు. పెండింగ్ ఎపిసోడ్ అచ్చం మ‌హ‌రాష్ట్ర ప‌రిస్థితులను తలపిస్తున్నాయి అనే చర్చ జరుగుతోంది. మ‌హ‌రాష్ట్రలో  కూడా ఇలాంటి ప‌రిస్థితే ఏర్పడింది. అక్కడి  శివసేన ఎన్సీపీ కూటమి ప్రభుత్వం  12 మంది పేర్లను  గ‌వ‌ర్నర్‌కు పంప‌గా నెల‌లు గ‌డిచినా  రాజ్‌భవన్‌ నిర్ణయం తీసుకోలేదు. చివరకు ప్రభుత్వం ముంబై హైకోర్టును ఆశ్రయించాల్సివచ్చింది. కోర్టు అదేశాల త‌రువాత అక్కడి గవర్నర్‌  కేంద్ర హోంమంత్రిని కూడ క‌లిసి ప‌రిస్థితులు వివ‌రించారు.


కేసీఆర్‌ కోర్టుకు వెళ్తారా? 

సో మ‌హ‌రాష్ట్ర గ‌వర్నర్‌ మాదిరిగా తెలంగాణ గ‌వ‌ర్నర్‌ కూడా ప‌రిశీలన పేరుతో పెండింగ్‌  పెడితే ఏళ్ళు గ‌డిచినా ఫ‌లితం ఉండ‌ద‌ని అర్థం అవుతోంది. అయితే మ‌హ‌రాష్ట్ర ప్రభుత్వం బాట‌లో టిఆర్ఎస్ సర్కార్‌ ఒక్క ప‌ద‌వి కోసం కోర్టు మెట్లు ఎక్కుతుందా?  లేదా  వేచి చూస్తుందా?  అన్నది హుజురాబాద్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత తేలే అవకాశముందనే చర్చ నడుస్తోంది. సో ఈ లెక్కన ఉప ఎన్నికలు ముగిసే వరకు కౌశిక్ రెడ్డికి నిరాశ తప్పదనే మాట వినిపిస్తోంది. ఐతే ఆ తర్వాతైనా ఆయనకు ఎమ్మెల్సీ దక్కుతుందా లేదా అనేది పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.





Updated Date - 2021-10-16T17:46:35+05:30 IST