ఆబ్కారీ శాఖకు రోజుకు వంద కోట్ల నష్టం

ABN , First Publish Date - 2022-05-07T18:09:42+05:30 IST

మద్యం వ్యాపారులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధం కావడంతో అబ్కారీశాఖకు రోజుకు వంద కోట్ల రూపాయలు నష్టం కలగనుందని అంచనా వేశారు. శుక్రవారం

ఆబ్కారీ శాఖకు రోజుకు వంద కోట్ల నష్టం

                             - ఆందోళనలో మద్యం వ్యాపారులు


బెంగళూరు: మద్యం వ్యాపారులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధం కావడంతో అబ్కారీశాఖకు రోజుకు వంద కోట్ల రూపాయలు నష్టం కలగనుందని అంచనా వేశారు. శుక్రవారం నుంచి ఆందోళన ప్రారంభమైంది. ఈనెల 19 వరకు నిరసన కొనసాగిస్తున్నట్టు మద్యం వ్యాపారులు ప్రకటించారు. 15 రోజులపాటు నిరసన కొనసాగితే ఏకంగా రూ. 1500 కోట్లు ప్రభుత్వానికి నష్టం కలగనుంది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 176 తాలూకాల పరిధిలో గ్రామస్థాయి నుంచి నగరం దాకా రోజూ రూ. 100 కోట్లకుపైగా వ్యాపారాలు సాగుతాయి. రాష్ట్ర అబ్కారీశాఖ రూపొందించిన కొత్త పాలసీకి వ్యతిరేకంగా మద్యం వ్యాపారులు ఆందోళనకు దిగారు. మద్యం కొనుగోలు చేసేది లేదని వారు ప్రకటించడంతో నష్టం తప్పదనిపిస్తోంది. కలబురగిలో ప్రారంభమైన ఆందోళన హొస్పేట, బెళగావి, మైసూరు, బెంగళూరు, రామనగర, మండ్య, హాసన్‌, చామరాజనగర, తుమకూరు, శివమొగ్గ, దావణగెరె జిల్లాల్లో కొనసాగింది. రాష్ట్రమంతటా తమ ఆందోళన కొనసాగనుందని రాష్ట్ర మద్యం వ్యాపారుల ఐక్య కూటమి ప్రధాన కార్యదర్శి గోవిందరాజ్‌ హెగ్డే ప్రకటించారు. కొత్త పాలసీని పాటించలేమని, ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోకపోతే వ్యాపారాలు కొనసాగించలేమన్నారు. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతానికి నగర, జిల్లా, తాలూకాల స్థాయిలో శ్రీకారం చుట్టామని గ్రామస్థాయికి తమ ఆందోళన తీసుకెళతామన్నారు. ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని, కానీ సంబంధిత అధికారులు స్పందించడం లేదన్నారు. కొవిడ్‌ కాలంలో తీవ్రంగా నష్టపోయామని, ఇప్పుడిప్పుడే వ్యాపారాలు గాడిన పడుతున్నాయని, కొత్త పాలసీతో వ్యాపారులను రోడ్డున పడేయాలనుకోవడం సరికాదన్నారు. అబ్కారీశాఖ మంత్రితోపాటు అధికారులు, సీఎం వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

Read more