అభిషేక్ బెనర్జీకి మళ్లీ టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి
ABN , First Publish Date - 2022-02-19T01:23:06+05:30 IST
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ టీఎంసీ జాతీయ..
కోల్కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని మళ్లీ నిలబెట్టుకున్నారు. మమతా బెనర్జీ నివాసంలో టీఎంసీ నేషనల్ వర్కింగ్ కమిటీ శుక్రవారంనాడు సమావేశమైంది. మమతా బెనర్జీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం సమారు గంటసేపు జరిగింది. జాతీయ రాజకీయలను దృష్టిలో ఉంచుకుని పార్టీ పదవులను ఈ సమావేశంలో కేటాయించారు.
పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మరోసారి అభిషేక్ బెనర్జీ నియమితులు కాగా, జాతీయ ఉపాధ్యక్షులుగా యశ్వంత్ సిన్హా, సుబ్రత బక్షి, చంద్రిమి భట్టాచార్య నియమితులయ్యారు. యశ్వంత్ సిన్హా, అమిత్ మిత్రాలకు ఆర్థిక విధానాల నిర్వహణ బాధ్యతను కూడా అప్పగించారు. రాజ్యసభలో పార్టీ ప్రతినిధిగా సుఖేందు శేఖర్ నియమితులు కాగా, లోక్సభకు పార్టీ ప్రతినిధిగా కకోలి ఘోష్దస్తిదార్ నియమితులయ్యారు. మహువ మెయిట్రో, సుఖేందు శేఖర్ రాయ్, కకోసి ఘోష్దస్తిదార్లు జాతీయ ప్రతినిధులుగా ఎంపికయ్యారు. ఈశాన్య రాష్ట్రాల వ్యవహారాలను సుస్మితా దేవ్ చూస్తారు.
టీఎంసీలోని పాత, కొత్త తరాల నేతల మధ్య ఎడం పెరుగుతున్న నేపథ్యంలో పార్టీ నేషనల్ ఆఫీస్ బేరర్ల కమిటీని మమతాబెనర్జీ శనివారంనాడు రద్దు చేశారు. 20 మంది సభ్యులతో వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో అభిషేక్తో సహా పార్టీ వెటరన్లకు కూడా చోటు కల్పించారు. కాగా, కొత్తగా ఏర్పాటు చేసిన టీఎంసీ వర్కింగ్ కమిటీలో అమిత్ మిత్రా, పార్థ చటర్జీ, సుబ్రతా బక్షి, సుధీప్ బందోపాధ్యయ్, అనుబ్రత మండల్, అరూప్ బిశ్వాస్, ఫిర్వద్ హకీం, యశ్వంత్ సిన్హాలకు సైతం చోటు దక్కింది.