వస్తయా.. రావా?
ABN , First Publish Date - 2020-11-30T05:01:09+05:30 IST
ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పిం ఛన్ పథకం అభాసుపాలవుతోంది.
- ఆసరా పింఛన్ల కోసం అవస్థలు
- రెండేళ్లుగా ఎదురు చూపులు
- కార్యాలయాల చుట్టూ లబ్ధిదారుల ప్రదక్షిణలు
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్) : ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పిం ఛన్ పథకం అభాసుపాలవుతోంది. కొత్తగా ఎంపికైన లబ్ధిదారులకు పింఛను డబ్బు అందక.. ఇంతకు వస్తాయా రావా అని టెన్షన్ పడుతున్నారు. పింఛన్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూపులు తప్పడం లేదు. నిత్యం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. దారిద్ర రేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఆసరా పథకాన్ని అమలు చేస్తుంది. ఇం దులో భాగంగా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత, బీడీ కార్మికులకు పిం ఛన్లు అందజేస్తుంది. 65ఏళ్లు నిండిన వారికి ఆసరా అందుతుంది. ఇదివరకు దివ్యాంగుల పింఛను రూ.1,500 ఉండగా వాటిని 3,016కు.. ఇతరులకు రూ.1000 ఉన్నది రూ.2016కు పెంచింది. పెంచిన పింఛను 2019 జూన్ నుంచి వర్తింప చేశారు. రంగారెడ్డి జిల్లాలో 1,69,688 మంది ఆసరా పింఛను తీసుకుంటున్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న 12,280 మంది లబ్ధిదారులకు మంజూరయ్యాయి. వీరంతా రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఇంతకు ఈ పింఛన్లు ఎప్పుడు ఇస్తారనే విషయంపై అధికారుల్లో స్పష్టత కరువైంది.
వయస్సు కుదింపు ఏమైంది?
ప్రస్తుతం 65ఏళ్లు నిండినవారికి మాత్రమే ఆసరా పింఛన్ వస్తుంది. ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ పింఛన్లు రెట్టింపు చేస్తామని, వృద్ధాప్య పింఛన్ వయస్సు 65ఏళ్ల నుంచి 57ఏళ్లకు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. దీనిలో పింఛన్ల పెంపును అమలు చేశారు. వయసు తగ్గించకపోవడంతో వేలాదిమంది వృద్ధులు నిరా శకు గురవుతున్నారు. ఓటరుజాబితాను ప్రామాణికంగా తీసుకుని 57ఏళ్లవయసు ఉన్నవారిని 31,947వేలు ఉన్నట్లు గుర్తించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు రాకపోవడంతో గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు ఆ జాబితాను పక్కన పెట్టారు.