Goa: ఆప్కు రాష్ట్ర పార్టీగా గుర్తింపు, మరో రాష్ట్రంలో గుర్తింపు వస్తే జాతీయ పార్టీ హోదా
ABN , First Publish Date - 2022-08-09T20:49:51+05:30 IST
అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ మరో ఘనత...
న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మరో ఘనత సాధించింది. గోవా (Goa)లో రాష్ట్ర పార్టీ(State party)గా గుర్తింపు పొందింది. గత ఫిబ్రవరి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పనితీరుపై సమీక్ష అనంతరం ఎన్నికల కమిషన్ నుంచి తమకు రాష్ట్ర పార్టీ హోదా లభించినట్టు ఆప్ తెలిపింది. ఆప్ ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్లో రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందింది. ఆ రెండు రాష్ట్రాల్లో అధికారంలో కూడా ఉంది.
మరో స్టేట్ దక్కితే చాలు...
ఢిల్లీ, పంజాబ్ తర్వాత గోవాలో కూడా రాష్ట్ర పార్టీగా ఆప్ గుర్తింపు పొందిందని, ఈ మేరకు తమకు ఎన్నికల సంఘం నుంచి సమాచారం వచ్చిందనని కేజ్రీవాల్ చెప్పారు. రిజర్వేషన్ అండ్ అలాట్మెంట్ ఆర్టర్-1968 నిబంధనల కింద ఆప్ను రాష్ట్ర పార్టీగా గుర్తించినట్టు ఎన్నికల కమిషన్ ఒక లేఖలో పేర్కొందని అన్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే జారీ అవుతుందని చెప్పారు. ఈసీ లేఖను ట్విట్టర్లో ఆయన పోస్ట్ చేశారు. మరో రాష్ట్రంలో ఆప్ గుర్తింపు పొందితే అధికారికంగా ఆప్ను జాతీయ పార్టీగా ప్రకటిస్తారని సీఎం తెలిపారు. పార్టీకి చక్కటి గుర్తింపు తెచ్చిన కార్యకర్తలకు, ఆప్ సిద్ధాంతాలపై నమ్మకం ఉంచిన ప్రజలకు కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ రెండు అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. 6.77 ఓటింగ్ షేర్ సాధించింది. పంజాబ్లో 117 అసెంబ్లీ స్థానాలకు గాను 92 గెలుచుకుని ఘన విజయం సాధించింది. మొత్తం ఓట్ల శాతంలో 42.01 శాతం ఓటింగ్ షేర్ పొందింది.