ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ నామినేషన్ దాఖలు

ABN , First Publish Date - 2022-01-29T19:24:22+05:30 IST

పంజాబ్ శాసన సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ముఖ్యమంత్రి

ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ నామినేషన్ దాఖలు

చండీగఢ్ : పంజాబ్ శాసన సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ శనివారం ధురి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సామాన్యుల సమస్యలను ఆప్ పరిష్కరిస్తుందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందన్నారు. ధురి ప్రజలు తనను ఆదరిస్తారని, భారీ ఆధిక్యతతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తనను ఆశీర్వదించారని చెప్పారు. పంజాబ్‌లో చరిత్ర సృష్టించవలసిన సమయం ఆసన్నమైందని చెప్పారన్నారు. 


ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా భగవంత్ మాన్‌ను జనవరి 18న ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. టెలిఫోన్, వాట్సాప్ సందేశాల ద్వారా ప్రజాభిప్రాయాన్ని సేకరించి, ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మాన్ రెండుసార్లు లోక్‌సభ సభ్యునిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఆయన లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగ్రూర్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ధురి నుంచి ప్రస్తుతం శాసన సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 


పంజాబ్ శాసన సభ ఎన్నికలు ఫిబ్రవరి 20న జరుగుతాయి, ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుంది. 


Updated Date - 2022-01-29T19:24:22+05:30 IST