జాతీయ పార్టీగా గుర్తింపు పొందే దిశగా ఆమ్ ఆద్మీ పార్టీ
ABN , First Publish Date - 2022-03-10T23:08:09+05:30 IST
పంజాబ్ శాసన సభ ఎన్నికల్లో గెలుపుతో జాతీయ
న్యూఢిల్లీ : పంజాబ్ శాసన సభ ఎన్నికల్లో గెలుపుతో జాతీయ పార్టీగా గుర్తింపు పొందే దిశగా ఆమ్ ఆద్మీ పార్టీ పయనిస్తోంది. జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే, లోక్సభ లేదా రాష్ట్ర శాసన సభల ఎన్నికల్లో కనీసం నాలుగు రాష్ట్రాల్లో పోలైన, చెల్లుబాటైన ఓట్లలో కనీసం 6 శాతం ఓట్లను పొందాలి. అంతేకాకుండా ఏదైనా రాష్ట్రంలో కనీసం నాలుగు శాసన సభ స్థానాల్లో లేదా లోక్సభ నియోజకవర్గాల్లో గెలవాలి.
గత ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి 54 శాతం ఓట్లు లభించాయి. పంజాబ్లో 42 శాతం ఓట్లు, గోవాలో 6.77 శాతం సంపాదించింది. ఉత్తరాఖండ్లో 3.4 శాతం ఓట్లు, ఉత్తర ప్రదేశ్లో 0.3 శాతం ఓట్లు లభించాయి. ఈ పార్టీకి కేవలం ఒక లోక్సభ సభ్యుడు భగవంత్ మాన్ ఉన్నారు.
ఈ ఏడాది డిసెంబరులో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో శాసన సభ ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసి, సత్ఫలితాలు సాధిస్తే, ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ పార్టీగా గుర్తింపు పొందే అవకాశం దక్కవచ్చు. లోక్సభలో రెండు శాతం స్థానాలను, కనీసం మూడు రాష్ట్రాల నుంచి గెలుచుకున్న పార్టీకి జాతీయ పార్టీగా గుర్తింపు లభిస్తుంది.
ప్రస్తుతం మన దేశంలో జాతీయ పార్టీలు : కాంగ్రెస్, బీజేపీ, టీఎంసీ, సీపీఎం, సీపీఐ, బీఎస్పీ, ఎన్సీపీ.