ఆధార్ ఉంటేనే దైవ దర్శనం
ABN , First Publish Date - 2020-06-07T08:11:05+05:30 IST
సుదీర్ఘ విరామం తర్వాత సోమవారం ఆలయాలు తెరుచుకోనున్నాయి. ఆధార్కార్డు లేని భక్తులకు ప్రధాన ఆలయాల్లో దైవదర్శనానికి అవకాశం ఉండదు. అలాగే కరోనా నేపథ్యంలో వృద్ధులు, పదేళ్లలోపు చిన్నారులు
- ప్రధానాలయాల్లో దర్శనానికి నిబంధన
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్)
సుదీర్ఘ విరామం తర్వాత సోమవారం ఆలయాలు తెరుచుకోనున్నాయి. ఆధార్కార్డు లేని భక్తులకు ప్రధాన ఆలయాల్లో దైవదర్శనానికి అవకాశం ఉండదు. అలాగే కరోనా నేపథ్యంలో వృద్ధులు, పదేళ్లలోపు చిన్నారులు, గర్భిణులకు కూడా ఆలయ ప్రవేశం ఉండదని అధికారులు తెలిపారు. ఆల్కహాల్ ఉండటం వల్ల గర్భాలయాల్లో పూజలు చేసే అర్చకులు శానిటైజర్ను వాడకూడదు. క్యూలైన్ల వద్ద భౌతికదూరాన్ని కచ్చితంగా పాటించేలా ఆయా దేవాలయాలు, పుణ్యక్షేత్రాల వద్ద అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ధ్వజస్తంభం, రాతిస్తంభాల పై విగ్రహాలు, దేవతా మూర్తులను భక్తులు ముట్టుకోకుండా, ప్రదక్షిణలు చేయకుండా బారికేడ్లు పెట్టారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రధానాలయాల వద్ద థర్మల్ స్ర్కీనింగ్ను ఏర్పాటు చేశారు.
శనివారం దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ సంధ్యారాణి వికారాబాద్ జిల్లాలోని అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించారు. చిలుకూరు బాలాజీ ఆలయాన్ని తెరవడంలేదని ఆ దేవాలయ ప్రధానార్చకుడు రంగరాజన్ తెలి పారు. పరిస్థితులను బట్టి ఆలయా న్ని తెరిచే తేదీని ప్రకటిస్తామన్నా రు. బాసరలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో 5 అడుగుల భౌతికదూరం పాటించేలా క్యూలైన్లలో సర్కిళ్లను ఏర్పాటు చేశారు. మాస్కులు ధరించేవారికే అమ్మవారి దర్శనం ఉం టుందని అధికారులు తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయంలో కోడెల క్యూలైన్ ద్వారా భక్తులను ఆలయంలోకి అనుమతిస్తారు. గంటకు 200 మంది చొప్పున రోజూ 2,400 మంది భక్తులకు రాజన్న లఘు దర్శనం ఉంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భద్రకాళి, కాళేశ్వరం, మల్లూరు హేమాచల క్షేత్రం, వేయిస్తంబాల గుడి, అయినవోలు మల్లికార్జున స్వామి దేవాలయాల్లో దర్శనాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీజనల్ వ్యాధుల భయంతో మేడారం సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద 2 నెలలపాటు దర్శనాలను నిలిపివేయనున్నట్టు సమాచారం. మార్చి 10-20 తేదీల్లో యాదాద్రి హుండీ ఆదాయం రూ.26.73లక్షలు సమకూరాయని అధికారులు తెలిపారు. ఆలంపూర్ జోగులాంబ దేవాలయం, మన్యంకొండ, ఉమామహేశ్వరం దేవాలయాల్లో.. భద్రాచలంలోనూ ఏర్పాట్లు పూర్తయ్యాయి.