పౌరసత్వానికి ఆధారమేదీ?

ABN , First Publish Date - 2020-02-20T08:48:37+05:30 IST

హైదరాబాద్‌ వాసులకు వచ్చిన తీరులో నోటీసులు వస్తే పౌరులు తమ పౌరసత్వాన్ని ఎలా నిరూపించుకోవాలన్నది దేశ ప్రజలకు ఇప్పుడు

పౌరసత్వానికి ఆధారమేదీ?

  • ‘భారతీయుడు’గా నిరూపణ ఎలా!?
  • ‘యూఐడీఏఐ’ నోటీసులతో గందరగోళం
  • పౌరసత్వానికి ఆధార్‌ రుజువు కాదన్న యూఐడీఏఐ
  • ఓటరు ఐడీ, పాస్‌పోర్టుల పరిస్థితి కూడా ఇంతే
  • విచారణ లేకుండానే ఆధార్‌ 
  • ప్రస్తుత సమస్యకు ఇదే కారణమంటున్న అధికారులు

‘మీరు భారతీయులేనా? నిరూపించుకోండి. సంబంధిత పత్రాలు సమర్పించండి’.. అంటూ యూఐడీఏఐ (ఆధార్‌) సంస్థ హైదరాబాద్‌లోని 127 మందికి నోటీసులు పంపింది. సంబంధిత పత్రాలతో గురువారం హాజరు కావాలని నిర్దేశించింది. వివాదం చెలరేగడంతో హాజరు తేదీని మూడు నెలలపాటు పొడిగించినా.. ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ‘ఆధార్‌’ కార్డు ప్రామాణికం కానప్పుడు పౌరసత్వాన్ని నిరూపించుకోవాలంటూ యూఐడీఏఐ వంటి సంస్థ నోటీసులు ఎలా జారీ చేస్తుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ వాసులకు వచ్చిన తీరులో నోటీసులు వస్తే పౌరులు తమ పౌరసత్వాన్ని ఎలా నిరూపించుకోవాలన్నది దేశ ప్రజలకు ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. నిజానికి, ఆధార్‌ తర్వాత కీలక డాక్యుమెంట్లుగా పాస్‌పోర్టు, ఓటరు గుర్తింపు కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌లను పరిగణిస్తారు. ఆధార్‌ కోసం దరఖాస్తు చేస్తే పాస్‌పోర్ట్‌, ఓటర్‌ గుర్తింపు కార్డు, రేషన్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పట్టాదారు పాసుపుస్తకం వంటి ఏదో ఒక డాక్యుమెంట్‌ సమర్పించాలి. వీటిలో ఏదైనా కావాలంటే ఆధార్‌ కార్డును తప్పనిసరిగా జత చేయాలి. కానీ, వీటిలో వేటినీ పౌరసత్వానికి ప్రామాణికంగా తీసుకోవడం లేదు. ఓటరు గుర్తింపు కార్డు, ఓటరు జాబితాలో పేరు ఉండడం, భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారాలు కావని ఇటీవల గువాహటి హైకోర్టు స్పష్టం చేసింది. ఇక, ఆధార్‌, ఓటరు ఐడీ, పాస్‌ పోర్టులు పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి రుజువులు కాదని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఈ నేపథ్యంలోనే, తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాలంటే పౌరులు ఏయే పత్రాలను చూపించాలనే విషయంపై తీవ్ర గందరగోళం నెలకొంది. పౌరసత్వానికి ఆధార్‌ రుజువు కాదని ఆ కార్డుపైనే ముద్రించి ఉంటుంది. కానీ, విచిత్రంగా ఓటరు గుర్తింపు కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ తదితరాలను పొందాలంటే ఆధార్‌ సమర్పించాల్సి ఉంటోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రతి పథకానికి, రాయితీలకు ఆధార్‌ను తప్పనిసరి చేశాయి. ఇది కీలకమైన డాక్యుమెంట్‌ కావడంతో దీనిని జారీ చేసే ముందు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని కేంద్రం ప్రారంభం నుంచే సూచనలు చేస్తోంది. ఇందులో భాగంగానే, ఆధార్‌ కోసం దరఖాస్తు చేస్తే పాస్‌పోర్ట్‌, ఓటర్‌ గుర్తింపు కార్డు, రేషన్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పట్టాదారు పాసుపుస్తకం వంటి ఏదో ఒక డాక్యుమెంట్‌ను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. వీటిని తప్పనిసరిగా ప్రభుత్వ అధికారి పరిశీలించి ఆధార్‌ కార్డు జారీ చేయాలి. ఈ విచారణ పక్కాగా జరగాలన్న లక్ష్యంతోనే ప్రైవేటు సంస్థలుగా ఉన్న మీసేవ కేంద్రాల నుంచి ఆధార్‌ జారీని ఏడాది క్రితమే యూఐడీఏఐ నిలిపివేసింది. కానీ, రాష్ట్రంలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. ప్రైవేటు ఆపరేటర్లే జారీ చేస్తున్నారు. ఆధార్‌ జారీ చేసే సమయంలోనే వారు సమర్పించిన ధ్రువపత్రాలను పరిశీలిస్తే.. తర్వాత నోటీసులిచ్చే అవకాశమే ఉండదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2020-02-20T08:48:37+05:30 IST