తల్లిదండ్రులు మందలించారని యువతి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-08-19T06:21:22+05:30 IST

తల్లిదండ్రులు మందలించారనే మన స్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన యువతి చికిత్స పొందుతూ మృతి చెందింది.

తల్లిదండ్రులు మందలించారని యువతి ఆత్మహత్య
సౌందర్య(ఫైల్‌ ఫొటో)

పాలకవీడు, ఆగస్టు18: తల్లిదండ్రులు మందలించారనే మన స్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన యువతి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన పాలకవీడు మండలం శూన్యపహాడ్‌లో జరిగింది. ఎస్‌ఐ సైదులుగౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. శూన్యపహాడ్‌ గ్రామానికి చెందిన రమావత్‌ కాంతారావుకు ముగ్గురు సంతానం. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సౌందర్య(19) ఉన్నారు. రెండు నెలల క్రితం దామరచర్ల మండలం కుందూరు జానారెడ్డి కాలనీకి చెందిన ధనావత్‌ గిరిబాబుతో సౌందర్యకు వివాహమైంది. పెళ్లయిన తర్వాత రాఖీ పండుగ రావడంతో తన సోదరులిద్దరికి రాఖీ కట్టేందుకు ఈ నెల 12న తన తల్లిదండ్రుల ఊరు శూన్యపహాడ్‌కు ఒంటరిగా వచ్చింది. పెళ్లి అయిన కొత్తలో అలా ఒంటరిగా రావొద్దని, భర్తను వెంట తీసుకురావాలని తల్లిదండ్రులు మందలించారు. తల్లిదండ్రుల మాటకు మన స్తాపం చెందిన సౌందర్య అదే రోజున(ఈ నెల 12న) ఇంట్లో ఎవరూ లేని సమయంలో పొలానికి తెచ్చిన గడ్డి మందును తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే గుర్తించిన కుటుంబసభ్యులు మిర్యాలగూడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న ఆ యువతి బుధవారం మృతి చెందింది. సౌందర్య తండ్రి రమావత్‌ కాంతారావు ఫిర్యాదుమేరకు గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 




Updated Date - 2022-08-19T06:21:22+05:30 IST