అమ్మాయిల హాస్టల్లోకి చొరబడ్డ యువకుడు
ABN , First Publish Date - 2020-02-25T09:10:21+05:30 IST
ఆదిలాబాద్ జిల్లా నార్నూరు బాలికల వసతిగృహంలోకి ఓ యువకుడు చొరబడి.
వెంటిలేటర్ ద్వారా లోనికి.. పోలీసులకు అప్పగింత
నార్నూర్, ఫిబ్రవరి 24: ఆదిలాబాద్ జిల్లా నార్నూరు బాలికల వసతిగృహంలోకి ఓ యువకుడు చొరబడి.. రోజంతా అక్కడే ఉన్నాడు. మూడు రోజుల క్రితం నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఓ యువకుడు బాలికల హాస్టల్లో చొరబడిన సంఘటనను మరవకముందే.. నార్నూరులో అలాంటి ఘటనే ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. కుమరంభీం-ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలానికి చెందిన ఓ యువకుడు ఈ నెల 17న నార్నూరులోని ఆదర్శ కళాశాల బాలికల వసతి గృహంలోకి చొరబడ్డాడు. తలుపుల్లేని వెంటిలేటర్ల ద్వారా అతడు లోనికి వెళ్లాడు. తర్వాతి రోజు సాయంత్రం హాస్టల్ కేర్టేకర్కు అనుమానం రావడంతో.. గది తలుపులు తెరిచి చూసింది. ఆ యువకుడిని గుర్తించి, కళాశాల ప్రిన్సిపాల్కు సమాచారం అందించింది. ప్రిన్సిపాల్ ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కాగా.. ఆ యువకుడికి హాస్టల్లో ఉండే ఓ విద్యార్థినితో ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లు సమాచారం. ఆ బాలికతోపాటు.. ఆమెకు సహకరించిన మరో ముగ్గురు విద్యార్థినులను హాస్టల్ నుంచి తొలగించి, వారి తల్లిదండ్రులకు అప్పగించినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.