ఏలూరు కుర్రోడిని వరించిన అదృష్టం.. ఏకంగా రూ.44 లక్షల జీతంతో..
ABN , First Publish Date - 2022-03-21T03:02:01+05:30 IST
చదువు పూర్తయినా ఉద్యోగం దొరకని పరిస్థితి నేడు. మరోవైపు ఉద్యోగాలు ఉన్నా సరైన నైపుణ్యం ఉన్నవారు దొరకడంలేదని కంపెనీలు అంటున్నాయి. ఇలాంటి సమయంలో ఏదో ఒక..
చదువు పూర్తయినా ఉద్యోగం దొరకని పరిస్థితి నేడు. మరోవైపు ఉద్యోగాలు ఉన్నా సరైన నైపుణ్యం ఉన్నవారు దొరకడంలేదని కంపెనీలు అంటున్నాయి. ఇలాంటి సమయంలో ఏదో ఒక ఉద్యోగం దొరికితే చాలనుకునే వారు చాలా మంది ఉన్నారు. తమ ప్రతిభకు తగ్గ ఉద్యోగమా, కాదా అనేది అసలు పట్టించుకోవడం లేదు. ఈ విషయం పక్కన పెడితే... టాలెంట్ ఉండాలే కానీ లక్షలు సంపాదించడం పెద్ద సమస్యేమీ కాదనేది నగ్న సత్యం. ఇదే విషయాన్ని ఇప్పటికే చాలా మంది నిరూపించి చూపించారు. తమ టాలెంట్ను నిరూపించుకుని కళ్ళు చెదిరే ఆఫర్లు అందుకుని వార్తల్లోకి వచ్చారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన ఒక కుర్రోడిని అదృష్టం వరించింది...
అమెజాన్ సంస్థలో ఉద్యోగం సాధించి ఏడాదికి అక్షరాలా రూ.44 లక్షల జీతం అందుకోనున్నాడు, పేరుని సార్థకం చేసుకున్న... విద్యాసాగర్. ఏలూరు కొత్తపేట దాసరి యర్రయ్యవీధిలో నివాసం ఉంటున్న పొట్నూరు విద్యాసాగర్.. గుంటూరులోని ఆర్వీఆర్ అండ్ జేసీ కళాశాలలో సీఎస్ఈ ఆఖరు సంవత్సరం చదువుతున్నాడు. నాలుగు నెలలుగా అమెజాన్ కంపెనీ ప్లేస్మెంట్ ప్రక్రియ నడుస్తోంది. విద్యాసాగర్ ఈనెల 17న అమెజాన్ కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్గా సెలక్ట్ అయ్యాడు. రాష్ట్రంలో మొత్తం ఐదుగురిని ఎంపిక చేయగా.. వీరిలో ఏలూరుకు చెందిన విద్యాసాగర్ ఒకరు. ఆయన తండ్రి వెంకటరమణ ఎస్బీఐలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. బంపర్ ఆఫర్ కొట్టిన విద్యాసాగర్ను బంధుమిత్రులు, స్థానికులు అభినందిస్తున్నారు.