వేట.. బతుకుతో ఆట!

ABN , First Publish Date - 2022-07-15T04:32:48+05:30 IST

రాష్ట్రంలో సుదీర్ఘ తీరప్రాంతం జిల్లా సొంతం. ఇచ్ఛాపురం మండలం డొంకూరు నుంచి రణస్థలం మండలం దోనిపేట వరకూ 193 కిలోమీటర్ల మేర తీరం విస్తరించి ఉంది. 104 మత్స్యకార గ్రామాల్లో లక్షకుపైగా జనాభా ఉండగా.. దాదాపు 7వేల మంది వేటకు వెళ్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. అపారమైన మత్స్య సంపద ఉన్నా.. జెట్టీలు, హార్బర్లు లేక మత్స్యకారులు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. స్థానికంగా గిట్టుబాటుకాక ఉపాధి కోసం సుదూర ప్రాంతాలకు వలసబాట పడుతున్నారు. ఏటా ఆగస్టులో వెళ్లి.. మార్చిలో స్వగ్రామాలకు చేరుతారు. ప్రస్తుతం ప్రత్యామ్నాయ ఉపాధి లేక గుజరాత్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు.

వేట.. బతుకుతో ఆట!

మత్స్యకారులకు తప్పని వలసబాట
సుదీర్ఘ తీరం ఉన్నా.. ఫలితం శూన్యం
హార్బర్లు, జెట్టీలు లేక గిట్టుబాటుకాని వైనం
రవాణా, మార్కెటింగ్‌ సదుపాయం అంతంతమాత్రం
(ఎచ్చెర్ల)

రాష్ట్రంలో సుదీర్ఘ తీరప్రాంతం జిల్లా సొంతం. ఇచ్ఛాపురం మండలం డొంకూరు నుంచి రణస్థలం మండలం దోనిపేట వరకూ 193 కిలోమీటర్ల మేర తీరం విస్తరించి ఉంది. 104 మత్స్యకార గ్రామాల్లో లక్షకుపైగా జనాభా ఉండగా.. దాదాపు 7వేల మంది వేటకు వెళ్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. అపారమైన మత్స్య సంపద ఉన్నా.. జెట్టీలు, హార్బర్లు లేక మత్స్యకారులు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. స్థానికంగా గిట్టుబాటుకాక ఉపాధి కోసం సుదూర ప్రాంతాలకు వలసబాట పడుతున్నారు. ఏటా ఆగస్టులో వెళ్లి.. మార్చిలో స్వగ్రామాలకు చేరుతారు. ప్రస్తుతం ప్రత్యామ్నాయ ఉపాధి లేక గుజరాత్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు.
.........................................
మత్స్యకారులకు వలస బాట తప్పడం లేదు. జిల్లాలో ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, పోలాకి, గార, శ్రీకాకుళం రూరల్‌, ఎచ్చెర్ల, రణస్థలంలో 104 సముద్ర తీర గ్రామాలు ఉన్నాయి. ఏటా ఈ గ్రామాల నుంచి గుజరాత్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు మత్స్యకారులు వలస వెళ్తారు.  ఏటా ఆగస్టు మొదటి వారంలో ఇక్కడి నుంచి పయనమవుతారు. ఈ ఏడాది కూడా వలసకు సిద్ధమవుతున్నారు. తుపాన్లు, ముసుర్ల సమయంలో మత్స్యకారులకు ఉపాధి గగనమే. ఏటా ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 15 వరకు రెండు నెలలపాటు సముద్రంలో చేపల వేట నిషేధిస్తారు. ఆ సమయానికిగాను మత్స్యకార భరోసా అందిస్తున్నా.. రకరకాల కారణాలు చూపి అర్హులకు మొండిచేయి చూపుతున్నారు. ప్రస్తుతం నిషేధం ఎత్తివేసినా.. వేట సక్రమంగా సాగడం లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో చేపలవేటకు సరైన సదుపాయాలు లేక.. వాతావరణం అనుకూలించకపోవడంతో ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. గుజరాత్‌, కాండ్ల, చెన్నై, కోల్‌కత్తా వంటి ప్రాంతాలకు వలస వెళ్లగా.. అక్కడ కూడా వేటలో ఆపసోపాలు పడుతున్నారు. గుజరాత్‌లో అరేబియా సముద్రంలో చేపలవేట సాగించే క్రమంలో పొరపాటున సరిహద్దు దాటితే పాక్‌ కోస్ట్‌గార్డులకు చిక్కే ప్రమాదం ఉంది. 2018లో ఈ ప్రాంతానికి చెందిన 21మంది మత్స్యకారులు పాక్‌కోస్ట్‌ గార్డులకు చిక్కారు. వీరంతా 14 నెలల పాటు పాక్‌ బందీలుగా ఉండి 2020 జనవరి నెలలో విడుదలయ్యారు. ఇలాంటి సంఘటనలు అంతకుముందు కూడా జరిగాయి. బోటుపై ఒకసారి బయలుదేరితే 20 నుంచి 25 రోజుల వరకు చేపల వేట సాగిస్తారు. బోటులో ఉన్నన్ని రోజులు స్నానం ఉండదు. దీని వల్ల చర్మవ్యాధులు సంక్రమిస్తాయి.  బోటులో ఉండగా జబ్బుపడితే సరైన మందులు కూడా లభించవు. పొరపాటున బోట్లు ఢీకొన్నట్టయితే గాయాలపాలైనా మందులు ఉండవు. ఒడ్డుకు చేరిన తర్వాత కూడా ఒకటి రెండు రోజులు బయట ఉన్నా... బోటులోనే విశ్రాంతి తీసుకోవాలి. ప్రత్యేకించి వీరికి విశ్రాంతి గదులు ఉండవు. ఎన్ని కష్టాలకు గురైనా చేపల వేట నుంచి ఒడ్డుకు చేరుకోలేరు. సముద్రంలో ఉండగా కొద్ది దూరం మాత్రమే మొబైల్‌ నెట్‌ వర్క్‌ ఉంటుంది. ఆ తర్వాత పూర్తిగా వైర్‌లెస్‌పై ఆధారపడాలి. ఇన్ని ఇబ్బందులున్నా వలసపోవడం తప్పడంలేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అమలుకాని హామీలు
గుజరాత్‌లోని అరేబియా సముద్రతీరంలో ప్రతి 30 కిలోమీటర్ల ఒకటి చొప్పున జెట్టీని నిర్మించారు. చేపటవేట సులువుగా సాగుతుండడంతో ఈ ప్రాంత మత్స్యకారులు గుజరాత్‌ రాష్ట్రానికి వలస వెళ్లేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఎచ్చెర్ల మండలం డి.మత్స్యలేశం పంచాయతీ రాళ్లపేట వద్ద జెట్టీ నిర్మిస్తామని నాడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి రాజీవ్‌ పల్లెబాటలో హామీ ఇచ్చారు. అప్పటి నుంచి ప్రతిపాదన దశ దాటలేదు. అలాగే టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం తీరంలో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మించేందుకు ప్రతిపాదన వచ్చింది. కేంద్ర కమిటీ కూడా పర్యటించింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బుడగట్లపాలెంలో గ్రామసభ నిర్వహించి ప్రజల అంగీకారం తీసుకున్నారు. ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణంపై సీఎం హామీ ఇచ్చారు. అయినా ఇప్పటికీ ఎటువంటి కదలిక లేదు. టెండర్లు ఖరారయ్యాయని అధికారులు చెబుతున్నా.. పనులు మాత్రం ప్రారంభించలేదు. జెట్టీలు, హార్బర్‌ ఏర్పాటైతే మత్స్యకారుల వలసలు నివారించే అవకాశం ఉంది.

ఇబ్బందులు ఎన్నో..
మత్స్యకారుల దినచర్య తెలవారుజామున 3 గంటలకు ప్రారంభమవుతుంది. భార్యాబిడ్డలు నిద్రలో ఉండగానే సంద్రానికి బయలుదేరుతారు. 12గంటల పాటు వేట సాగిస్తారు. మధ్యాహ్నం తరువాతే తీరానికి చేరుతారు. గతంలో కంటే ప్రస్తుతం మోటారు బోట్లతో వేటాడేవారి సంఖ్య ఎక్కువైంది. సుమారు రూ.3లక్షల విలువ చేసే పైబర్‌ బోటును ఇద్దరు, ముగ్గురు మత్స్యకారులు కలిసి కొనుగోలు చేసి వేటాడుతారు. మోటారు బోటు కోసం గంటకు 2 లీటర్ల వంతున రోజుకు 12లీటర్ల వరకూ డీజిల్‌ ఖర్చు చేయాల్సి వస్తోంది. జిల్లాలో సుదూర సముద్ర తీరం ఉన్నా చేపలవేట అంతంత మాత్రమే. రసాయనిక పరిశ్రమల ప్రభావంతో చేపలు వృద్ధి చెందడం లేదు. రసాయనిక వ్యర్థాలను సముద్రపు జలాల్లోకి విడిచిపెట్టడంతో మత్స్య సంపదకు తీవ్ర విఘాతం వాటిల్లుతోంది.

వలసలు తప్పడం లేదు
చేపల వేటకు వెళ్తున్నా కనీసం గిట్టుబాటు రావడంలేదు. ఈ పరిస్థితుల్లో వలసలు తప్పేలా లేవు. కొద్దిరోజులుగా చేపల వేటకు వాతావరణం అనుకూలించడంలేదు. వేటకు ప్రతి రోజూ బయలుదేరుతున్నా, వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
ఎం.రాజారావు, మత్స్యకారుడు, డి.మత్స్యలేశం

ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం
చేపల వేట లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇంజన్‌ బోట్లపై ఏడెనిమిది మంది చేపలవేటకు వెళితే కనీసం డీజిల్‌ ఖర్చులు కూడా రాని పరిస్థితి ఉంది. సౌకర్యాలు మెరుగుపడితే తప్ప ఈ ప్రాంతంలో వేటకు అనుకూలంగా ఉండదు.
ఎం.సత్యం, మత్స్యకారుడు, డి.మత్స్యలేశం
 

Updated Date - 2022-07-15T04:32:48+05:30 IST