రైలు కింద పడి మహిళ ఆత్మహత్య.. మర్నాడే నదిలోకి దూకిన మరో వ్యక్తి.. ఇద్దరి ఫోన్కాల్ డేటాను చెక్ చేసిన పోలీసులకు..
ABN , First Publish Date - 2022-04-30T17:53:21+05:30 IST
ఆ మహిళ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.. ఆ మర్నాడే ఓ వ్యక్తి నదిలో పడిపోయి చనిపోయాడు..
ఆ మహిళ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.. ఆ మర్నాడే ఓ వ్యక్తి నదిలో పడిపోయి చనిపోయాడు.. ఇద్దరి ఫోన్ కాల్ డేటా చెక్ చేసిన తర్వాత షాకింగ్ విషయం బయటపడింది.. ఇద్దరూ అనుకునే వేర్వేరు స్థలాల్లో ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారని తేలింది.. ఇద్దరిదీ ఒకే ప్రాంతమని, వివాహేతర సంబంధం కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించారు.
కేరళలోని ఎడతలకు చెందిన శ్రీకాంత్ (34) అనే వ్యక్తి గురువారం ఉదయం మార్తాండవర్మ బ్రిడ్జ్ మీద నుంచి పెరియార్ నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకు ముందు రోజు మంజు (42) అనే మహిళ ఓ రైలు కింద పడి చనిపోయింది. పోలీసులు మంజు ఫోన్ డేటా పరిశీలించగా శ్రీకాంత్ విషయం బయటపడింది. మంజు రైలు కింద పడిన సమయంలో శ్రీకాంత్ అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత అతను ఆటో ఎక్కి పెరియార్ నది వద్దకు వెళ్లి దానిలో దూకేశాడు.
మంజు ఇంటికి దగ్గర్లోనే మూడు నెలల క్రితం శ్రీకాంత్ ఓ అద్దె గదిలో దిగాడు. అప్పట్నుంచి ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. శ్రీకాంత్ బ్యాచిలర్ కాగా, మంజు ఇద్దరు పిల్లలకు తల్లి. వివాహేతర సంబంధం కారణంగానే శ్రీకాంత్, మంజు ఆత్మహత్యలు చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించారు.