‘కామన్వెల్త్’ విజేతలకు ఘన స్వాగతం
ABN , First Publish Date - 2022-08-11T08:49:39+05:30 IST
ర్మింగ్హామ్ కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించి హైదరాబాద్ చేరిన తెలుగు క్రీడాకారులకు...
శంషాబాద్ (ఆంధ్రజ్యోతి): బర్మింగ్హామ్ కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించి హైదరాబాద్ చేరిన తెలుగు క్రీడాకారులకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. బుధవారం ఉదయం షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, సాత్విక్ సాయిరాజ్, గాయత్రి గోపీచంద్కు తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ప్రతినిధులు, పుల్లెల గోపీచంద్ అకాడమీ సిబ్బంది స్వాగతం పలికారు. ఇక, కామన్వెల్త్ మిక్స్డ్ డబుల్స్లో టేబుల్ టెన్నిస్ దిగ్గజం శరత్ కమల్తో కలిసి స్వర్ణం సాధించిన హైదరాబాదీ ఆకుల శ్రీజకు క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్వయంగా ఎయిర్పోర్టుకు వెళ్లి స్వాగతం పలికారు. శ్రీజ విజయం యువతరానికి స్ఫూర్తిదాయకమని మంత్రి కొనియాడారు. శ్రీజను ఓపెన్ టాప్ జీప్పై ఎయిర్పోర్టు నుంచి దాదాపు 5 కిలోమీటర్ల వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.
ఎయిర్పోర్ట్లో శ్రీజకు చంద్రబాబు అభినందన: కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ పోటీల్లో మిక్స్డ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించి హైదరాబాద్కు విచ్చేసిన ఆకుల శ్రీజను శంషాబాద్ విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అభినందించారు.