BJP నేత అరెస్టులో ట్విస్ట్... పంజాబ్ పోలీసులపై కిడ్నాప్ కేసు...

ABN , First Publish Date - 2022-05-06T18:52:14+05:30 IST

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేత తజిందర్ పాల్ సింగ్

BJP నేత అరెస్టులో ట్విస్ట్... పంజాబ్ పోలీసులపై కిడ్నాప్ కేసు...

న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ (BJP) నేత తజిందర్ పాల్ సింగ్ బగ్గాను అరెస్టు చేసి, పంజాబ్ తీసుకెళ్తున్న ఆ రాష్ట్ర పోలీసులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. బగ్గాను పంజాబ్ పోలీసులు కిడ్నాప్ చేసినట్లు ఆరోపిస్తూ ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనను అరెస్టు చేయడంలో సరైన నిబంధనలను పాటించలేదని ఆరోపించారు. ఆయనను తిరిగి ఢిల్లీ తీసుకెళ్తున్నారు.


ట్విటర్ పోస్టులు, మీడియా ఇంటర్వ్యూలలో మతపరమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లు బగ్గాపై పంజాబ్ పోలీసులు కేసు నమోదు చేశారు. బగ్గాను అరెస్టు చేస్తున్నట్లు జనక్‌పురి పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చి, శుక్రవారం ఉదయం పశ్చిమ ఢిల్లీలోని జనక్‌పురిలో ఉన్న ఆయన నివాసం నుంచి ఆయనను అరెస్టు చేశామని పంజాబ్ పోలీసులు తెలిపారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో విచారణకు హాజరుకావాలని ఐదు నోటీసులు ఇచ్చినప్పటికీ, ఆయన హాజరుకాకపోవడంతో ఈ చర్య తీసుకున్నామన్నారు.


బగ్గా తల్లి మీడియాతో మాట్లాడుతూ, పంజాబ్ పోలీసులు తన కుమారుడిని మతాచారం ప్రకారం ధరించే తలపాగాను ధరించనివ్వలేదన్నారు. పోలీసుల చర్యలను వీడియో తీస్తున్న తన భర్తపై దాడి చేశారని చెప్పారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాదాగిరి చేస్తున్నారని మండిపడ్డారు. 


బగ్గాను అరెస్టు చేసి, పంజాబ్ తీసుకెళ్తున్న వాహన శ్రేణిని హర్యానాలోని కురుక్షేత్ర వద్ద హర్యానా పోలీసులు ఆపారు. అనంతరం ఆయనను ఢిల్లీ పోలీసులు తిరిగి ఢిల్లీ తీసుకెళ్తున్నారు. 


బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడు తేజస్వి సూర్య ఇచ్చిన ట్వీట్‌లో, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దుష్టశక్తులతో చేతులు కలిపారని ఆరోపించారు. తజిందర్ బగ్గా తల్లితో తాను మాట్లాడానని, ఈ అణచివేత సమయంలో తమ వ్యవస్థ మొత్తం ఆ కుటుంబానికి మద్దతుగా నిలుస్తుందని చెప్పానని తెలిపారు. బగ్గాను సురక్షితంగా తీసుకురావడం కోసం బీజేవైఎం అన్ని విధాలుగా ప్రయత్నిస్తుందని తెలిపారు. 


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను బగ్గా బెదిరించినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఒకరు పంజాబ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 


Read more